కట్నం తీసుకురాలేదని భార్య ముక్కు, జడ కట్
లక్నో: వరకట్నం దాహం ఎంతటికైనా తెగిస్తుందని ఒక నీచుడు నిరూపించాడు. జీవితాంతం తోడు ఉంటానని పెళ్లి చేసుకున్న భార్య వరకట్నం తీసుకురాలేదని రాక్షసుడిలా ప్రవర్థించాడు. అతనికి భార్య జీవితం కంటే డబ్బు, బైక్ ముఖ్యం అయ్యింది.
కట్నం తీసుకురాలేదని కత్తెర తీసుకుని భార్య ముక్కు, జడ కత్తిరించి పైచాచికం చూపించాడు. ఉత్తరప్రదేశ్ లోని పిలిబిట్ సమీపంలోని కోత్ వాలీ పూరాన్ పూర్ లో జరిగిన ఈ దారుణ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కోత్ వాలీ పురాన్ పూర్ లో ఆలమ్ (34), రుబీనా దంపతులు నివాసం ఉంటున్నారు.
వివాహం అయిన సమయంలో రుబీనా కుటుంబ సభ్యులు ఆలమ్ కు కట్నం కింద నగదు ఇచ్చారు. అనంతరం ఆలమ్ నిత్యం భార్యను హింసించడం మొదలు పెట్టాడు. పుట్టింటికి వెళ్లి కట్నం కింద రూ. 20 వేలు, బైక్ తీసుకురావాలని వేదించాడు.
మా పుట్టింటి వారి పరిస్థితిబాగలేదని ఇప్పుడు నగదు తీసుకురాలేనని రుబీనా చెప్పింది. అంతే ఆలమ్ రెచ్చిపోయాడు. ఇంటిలో ఉన్న కత్తెర తీసుకుని రుబీనా ముక్కు, జడకత్తిరించాడు. ముక్కు తెగిపోయి రక్తం ఎక్కువ పోవడంతో రుబీనా కేకలు వేసింది.
విషయం గుర్తించిన స్థానికులు రుబీనాను ఆసుపత్రికి తరలించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళ్లడంతో వైద్యులు చికిత్స చేశారు. విషయం తెలుసుకున్న రుబీనా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలమ్ పరారైనాడని కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.