ప్రియురాలికి మెసేజ్: 16అంతస్తుల భవనంపై నుంచి దూకాడు
ఫరీదాబాద్: హర్యానా రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలికి ఫేస్బుక్ లో ఆడియో మెసేస్ పెట్టిన ఓ యువకుడు.. భవనం 16వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు హర్యానాలోని గుర్గావ్లో కాల్ సెంటర్లో టీమ్ మేనేజర్గా పనిచేస్తున్న అమన్ నాగపాల్గా గుర్తించారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తనతో కలిసి పనిచేస్తున్న యువతితో అమన్ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఆమెతో గొడవపడి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు.
వీరిద్దరూ ఎస్ఆర్ఎస్ హిల్ వ్యూలో నివసిస్తున్నారని, కొద్దిరోజుల క్రితం ఘర్షణ పడ్డారని తెలిపారు. అమన్ ప్రియురాలు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోవడంతో, మానసికంగా అతడు కుంగిపోయాడని చెప్పారు.
ఆత్మహత్యకు ముందు అమన్ తన ఆవేదనను రికార్డ్ చేసి ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడని చెప్పారు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపామని పోలీసు అధికారి కిమ్తీ లాల్ తెలిపారు. యువతి తండ్రి, పిన్ని, మరో యువకుడిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.