ఆడిపిస్తానని చెప్పి నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన మానవ మృగం
పంజాబ్ :పంజాబ్లో దారుణం చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిపై ఆమె చదివే స్కూళ్లో పనిచేస్తున్న వ్యక్తి అత్యాచారం చేశాడు.నాలుగేళ్ల చిన్నారిపై ఆ మానవ మృగం లైంగిక దాడి చేసింది. పంజాబ్లోని సంగ్రూర్ జిల్లాలోని ధూరి పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం రోజున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీంతో ఆ చిన్నారి నివసిస్తున్న ప్రాంత వాసులు స్కూలు యాజమాన్యంపై నిరసన తెలిపారు.
చిన్నారి చదువుతున్న ఓ ప్రైవేట్ స్కూలులో శనివారం రోజున టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్కు చిన్నారి తన తల్లిదండ్రులతో సహా హాజరైంది. మీటింగ్ జరుగుతున్న సమయంలో ఓ 27ఏళ్ల వ్యక్తి చిన్నారిని పక్కకు తీసుకెళ్లాడు. పక్కనే ఉన్న పార్కులోకి తీసుకెళ్లి కాసేపు ఆడిపించి అనంతరం ఓ గదికి తీసుకెళ్లి చిన్నారిపై అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసిన తర్వాత ఆ వ్యక్తి చిన్నారిని తిరిగి స్కూలులో వదిలేశాడు. ఇక మీటింగ్ ముగిసిన తర్వాత చిన్నారి తల్లి ఆమెను తీసుకుని ఇంటికి తీసుకెళ్లింది. అయితే జరిగిన ఘటన గురించి ఆమెకు ఇంకా తెలియలేదు. ఇదిలా ఉంటే చిన్నారిని తీసుకెళ్లి అత్యాచారం చేసిన వ్యక్తిని ఆ స్కూల్లో అటెండర్ కమ్ కండక్టరుగా పనిచేసే వ్యక్తిగా గుర్తించారు.
శనివారం సాయంత్రం నుంచి చిన్నారి తన పొత్తికడుపులో నొప్పిగా ఉందని తల్లికి ఫిర్యాదు చేసింది. ఆదివారం కూడా చాలా నొప్పిగా ఉందని తెలపడంతో ఆమెను తల్లిదండ్రులు దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే చిన్నారిని పరీక్షించిన వైద్యులు ఆమెపై లైంగిక దాడి జరిగిందని ధృవీకరించారు. ఈ వార్త దావనంలో పాకడంతో నిరసనలు ధూరి ప్రాంతాన్ని కుదిపేశాయి. స్థానిక పోలీస్ స్టేషన్ బయట ధర్నా చేశారు నిరసనకారులు. చిన్నారిపై లైంగిక దాడి చేసిన నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే సంగ్రూర్ ఎస్ఎస్పీ కుమార్ గార్గ్ నిందితుడిని ఆదివారం అరెస్టు చేసినట్లు చెప్పారు.
బాధితురాలి తరుపున బంధువులు కొన్ని డిమాండ్లు తమ ముందు ఉంచారని పోలీసులు తెలిపారు. ముందుగా నిందితుడిని అరెస్టు చేయాలని చెప్పారని నిందితుడిని అరెస్టు చేశామని చెప్పారు. ఇక స్కూలు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇక మూడో డిమాండ్గా నిందితుడిని తమకు అప్పజెప్పాలన్నారని అయితే చట్టపరంగా అతనిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చినట్లు చెప్పారు.