దావూద్ గ్యాంగ్ పేరుతో.. శరద్ పవార్ ఇంటిని పేల్చేస్తామని బెదిరింపులు...
శివసేన నేత సంజయ్ రౌత్తో పాటు,ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్లకు బెదిరింపు కాల్స్ చేస్తున్న ఓ వ్యక్తిని శనివారం(సెప్టెంబర్ 12) అరెస్ట్ చేసినట్లు మహారాష్ట్ర టెర్రర్ స్క్వాడ్(ATS) వెల్లడించింది. నిందితుడు మూడు ఇంటర్నేషనల్ సిమ్ కార్డులు ఉపయోగించి బెదిరింపు ఫోన్ కాల్స్ చేసినట్లు తెలిపింది. యాంటీ టెర్రర్ స్క్వాడ్ డీసీపీ విక్రమ్ దేశ్మణే దీనిపై మీడియాకు వివరాలు వెల్లడించారు.
నిందితుడు పాలష్ ఘోష్ను కోల్కతాలో అరెస్ట్ చేసినట్లు విక్రమ్ తెలిపారు. అతనో జిమ్ ట్రైనర్ అని చెప్పారు. శివసేన నేత సంజయ్ రౌత్కు విక్రమ్ ఘోష్ పదేపదే బెదిరింపు ఫోన్ కాల్స్,ఎస్ఎంఎస్లు చేశాడన్నారు. తాను దావూద్ గ్యాంగ్ సభ్యుడినని చెబుతూ సంజయ్ రౌత్ను పలుమార్లు బెదిరించాడన్నారు. అంతేకాదు,ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇల్లును కూడా పేల్చేస్తానని అతను బెదిరింపులకు దిగాడని... మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే నివాసానికి కూడా బెదిరింపు కాల్స్ చేశాడని పేర్కొన్నారు.
గతంలో అతను దుబాయిలో 15 ఏళ్లు పనిచేశాడని.. మూడు ఇంటర్నేషనల్ సిమ్ కార్డులతో ఈ బెదిరింపులకు పాల్పడుతూ వస్తున్నాడని చెప్పారు. విచారణలో అతను నేరం అంగీకరించినట్లు తెలిపారు. తనకెలాంటి క్రిమినల్ నేపథ్యం లేదని.... కొన్ని మొబైల్ యాప్స్ ద్వారా ప్రముఖ రాజకీయ నేతల ఫోన్ నంబర్స్ సంపాదించి వారికి ఫోన్ చేసినట్లు నిందితుడు తెలిపాడన్నారు. ఘోష్ అరెస్ట్ కోసం ముంబై పోలీసులు కోల్కతా పోలీసులను సంప్రదించగా.... దానిపై కూడా అతను సంజయ్ రౌత్కు ఫోన్ చేసి బెదిరించాడన్నారు. ఎట్టకేలకు కోల్కతా పోలీసుల సహాయంతో అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.