దారుణం: కోడలి జాతకంలో దోషం ఉందని నాలుగేళ్లుగా అత్యాచారం, పెళ్లైనా వదల్లేదు
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో దారుణం వెలుగు చూసింది. జాతకంలో దోషం ఉందని చెబుతూ ఓ 23 ఏళ్ల యువతిపై మేనమామ నాలుగేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ దోషం సరి చేసుకోకుంటే తండ్రి చనిపోతాడని నిందితుడు బాధితురాలిని లొంగ దీసుకున్నాడు.
ఢిల్లీలోని నారేలా ప్రాంతానికి చెందిన యువతిపై మేనమామ కన్నేశాడు. ఆమెను లోబర్చుకోవాలనుకున్నాడు. దీంతో ఆమె జాతకంలో దోషం ఉందని, ఎప్పటికీ పెళ్లి కాదని, తండ్రి చనిపోతాడని నమ్మబలికాడు. తాను చెప్పినట్లు వింటే దోషం పోతుందని చెప్పాడు.
ఆమెపై నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెకు ఇటీవలే పెళ్లయింది. అయినా అతను బుద్ధి మార్చుకోలేదు. తనకు పెళ్లయిందని, తనకు భర్త ఉన్నాడని వదిలేయమని చెప్పినా వినలేదు. ఆమె ధైర్యం చేసి అత్తింటి వారికి చెప్పింది. వారి సహాయంతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. బాధితురాలికి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ఢిల్లీ కమిషన్ ఫర్ వుమెన్కు పోలీసులు సమాచారం ఇచ్చారు.