అయ్యో...! ఆ సూప్ తాగాడని అతన్ని ఇనుపరాడ్లతో చితకబాదారు
నాగపట్టణం: తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. బీఫ్ సూప్ తాగాడని చెప్పి ఓ వ్యక్తిని చితకబాదిన ఘటన నాగపట్టిణంలో జరిగింది. బొరవచేరి గ్రామానికి చెందిన మొహ్మద్ ఫైజాన్ అనే వ్యక్తి బీఫ్ సూప్ తాగుతూ ఫోటో తీసుకుని ఫేస్బుక్లో పోస్టు చేశాడు. ఈ పోస్టును చూసిన హిందూ మక్కల్ కట్చి గ్రూపు సభ్యులు మొహ్మద్ ఫైజాన్ ఇంట్లోకి దూసుకెళ్లి చితకబాదారు. ఆ తర్వాత ఇనుప రాడ్లతో దాడి చేశారు.
హిందూ సంస్థకు చెందిన సభ్యులు దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఫైజాన్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇప్పటి వరకు దినేష్ కుమార్, గణేష్ కుమార్, మోహన్ కుమార్, అగస్త్యన్లను అరెస్టు చేసి హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఈ మధ్యకాలంలో బీఫ్ తినేవారిపై హిందూ అతివాద సంస్థలకు చెందిన సభ్యుల సామూహిక దాడులు ఎక్కవయ్యాయి. ఇక సామూహిక దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా, పలు రాష్ట్రాలు చట్టాలు చేసినా దాడులు మాత్రం ఆగడం లేదు.
బీఫ్ తినేవారిపై గోవులను రవాణా చేసేవారిపై ఎక్కువగా దాడులు జరిగింది ఉత్తర భారతంలోనే. అయితే ఇలా దక్షిణ భారతంలో దాడులు జరగడం చాలా అరుదని పోలీసులు చెబుతున్నారు. మాబ్ లించింగ్పై ఈ మధ్యే ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని సామూహిక దాడులకు పాల్పడిన వారికి ఏడేళ్ల నుంచి జీవితకాల శిక్ష పడే అవకాశం ఉంది. దీనితో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది.