షాకింగ్: చనిపోయిన కూతుర్ని పూడ్చుతుండగా.. మూడడుగుల లోతులో బతికున్న శిశువు ప్రత్యక్షం!
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలిలో అద్భుత ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన తన కూతురు చనిపోవడంతో ఓ వ్యాపారి.. ఆమె మృతదేహాన్ని పూడ్చిపెట్టేందుకు వెళ్లాడు. మట్టితవ్వుతుండగా కొంత లోతులో జీవించి ఉన్న మరో శిశువు బయటపడింది. దీంతో ఆ శిశువును వెంటనే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించాడు తన కూతుర్ను పోగొట్టుకున్న ఓ తండ్రి.
నెలలు నిండకుండానే పుట్టి..
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభినందన్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. హితేష్ కుమార్ సిరోహి అనే వ్యాపారి భార్య వైశాలి బరేలిలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తోంది. కాగా, గర్భవతి అయిన ఆమెకు నొప్పులు రావడంతో వారం రోజుల క్రితం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు హితేష్ కుమార్. గర్భం దాల్చిన ఏడు నెలలకే ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. పూర్తి నెలలు నిండకుండా పుట్టిన ఆ పాప కొద్ది నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయింది. దీంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు సిరోహి దంపతులు.
మృతశిశువును పూడ్చిపెడుతుండగా..
ఆ తర్వాత మృత శిశువును మట్టిలో పూడ్చేందుకు తీసుకెళ్లాడు సిరోహి. అయితే, మట్టి తవ్వుతుండగా మూడు అడుగుల లోతులో ఓ కుండలాంటి వస్తువులో జీవించి ఉన్న ఓ ఆడ శిశువు కనిపించింది. ప్రాణాలతో ఉన్న ఆ శిశువును వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాడు సిరోహి. ప్రస్తుతం ఆ పాప ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
బతికుండగా పూడ్చిందెవరు?
కాగా, తనకు దొరికిన ఆ పాపను తాను దత్తత తీసుకుంటానని హితేష్ కుమార్ వెల్లడించారు. ఆమె ఆలనాపాలనకు అయ్యే ఖర్చును తానే భరిస్తానంటూ స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రాజేష్ మిశ్రా తెలిపారు. బతికుండగానే శిశును మట్టిలో పాతిపెట్టిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శైలేంద్ర పాండే తెలిపారు. ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.