కూతురుకి లైంగిక వేధింపులు: తండ్రి సజీవ దహనం
లక్నో: కూతురుపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితులపై ఓ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలిసిన నిందితులు ఫిర్యాదు చేసిన బాధితురాలి తండ్రిని సజీవ దహనం చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కేతన్ఖేడ్ గ్రామంలో చోటు చేసుకుంది.
ఆజ్గెయిన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనలో ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాంసేవక్ అనే వ్యక్తిని నిందితులు సోమవారం రాత్రి సజీవ దహనం చేశారని పోలీసులు తెలిపారు.
మంటలు అంటుకోవడంతో బాధితుడు సమీపంలోని నీటి కుంటలో దూకాడు. తీవ్రగాయాలపాలైన అతడ్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు మంగళవారం ఉదయం మృతి చెందాడు.
పప్పు, కాళీచరణ్, ఫత్తే అనే ముగ్గురు వ్యక్తులు తనను లైంగిక వేధించి, తన తండ్రికి నిప్పుపెట్టారని మృతుడి కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.