అంబులెన్స్ ఇవ్వని అధికారులు : భార్య శవాన్ని మోసుకెళ్ళిన భర్త
లక్నో: అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వివాహిత మృతి చెందింది. అయితే ఆమె మృతదేహన్ని తరలించేందుకు అవసరమైన అంబులెన్స్ను ఇచ్చేందుకు ఆసుపత్రి సిబ్బంది నిరాకరించడంతో భార్య మృతదేహన్ని భుజంపైనే మోసుకొంటూ తీసుకెళ్ళాడో ఓ వ్యక్తి. ఈ ఘటన మీడియాలో ప్రసారమైంది. దీనిపై విచారణకు ఆదేశించారు. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని బదౌన్లో ఈ ఘటన చోటు చేసుకొంది.
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని బదౌన్కు చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను బదౌన్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అనారోగ్యంతో ఆమె మృతి చెందింది. భార్య మృతదేహన్ని ఇంటికి తీసుకెళ్ళేందుకు ఆసుపత్రి సిబ్బందిని అంబులెన్స్ అడిగాడు.
కానీ, ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్ ఇవ్వలేదు. ఆటో కూడ రాకపోవడంతో భార్య మృతదేహన్నిఆ వ్యక్తి తన భుజాలపై మోసుకొని ఇంటికి తీసుకొచ్చాడు. ఈ ఘటనను మీడియా పెద్ద ఎత్తున ప్రసారం చేసింది.
ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టుగా బదౌన్ ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రకటించారు. అంబులెన్స్ అడిగిన కొద్ది సేపటికే మృతదేహం ఆ వ్యక్తి ఆసుపత్రి ఆవరణ నుండి వెళ్ళిపోయాడని ఆసుపత్రివర్గాలు చెబుతున్నాయి. అంబులెన్స్ ఇచ్చేందుకు తాము నిరాకరించలేదని ఆసుపత్రివర్గాలు ప్రకటిస్తున్నాయి.
అయితే ఆసుపత్రిలో తాను ఈ విషయమై అంబులెన్స్ అడిగినా సిబ్బంది నుండి సరైన సమాధానం లేదన్నారు.ఈ కారణంగానే తన భార్య మృతదేహన్ని భుజాలపై మోసుకొచ్చినట్టు చెప్పారు.