కండోమ్లో డ్రగ్స్ దాచి: అధికారులకే షాక్.. ఇలా కనిపెట్టారు!..
చెన్నై నుంచి కొలంబో వెళ్లాల్సిన విమాన ప్రయాణికుల వద్ద చేపట్టిన తనిఖీల్లో డ్రగ్స్ వెలుగుచూశాయి.
చెన్నై: నిన్న మొన్నటిదాకా హైదరాబాద్ను ఓ కుదుపు కుదేపిసిన డ్రగ్ మార్కెట్ ఇప్పుడు చెన్నైను కుదేపిస్తోంది. ఒక్క బుధవారం రోజే కోట్ల విలువ చేసే డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపుతోంది.
చెన్నై అంతర్జాతీయ విమానశ్రయం కేంద్రంగా పలు ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు తాజా తనిఖీల్లో నిర్దారణ అయింది. పట్టుబడినవారిని విచారిస్తున్న పోలీసులు.. మరిన్ని వివరాలు రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
కోట్ల విలువ చేసే డ్రగ్స్
డ్రగ్స్ అక్రమ సరఫరాకు.. చెన్నై అంతర్జాతీయ విమానశ్రయాన్ని మాఫియా గ్యాంగ్ అడ్డాగా మార్చుకున్నట్టు కనిపిస్తోంది. బుధవారం వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు రూ.5.35కోట్లు విలువ చేసే డ్రగ్స్, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అండర్ గార్మెంట్స్లో డ్రగ్స్ దాచి
చెన్నై నుంచి కొలంబో వెళ్లాల్సిన విమాన ప్రయాణికుల వద్ద చేపట్టిన తనిఖీల్లో డ్రగ్స్ వెలుగుచూశాయి. విమానంలోకి అనుమతించే ముందు నిర్వహించే తనిఖీల్లో అమీర్ షాజహాన్ అనే వ్యక్తిపై అధికారులకు అనుమానం కలిగింది. అతని ప్రైవేట్ భాగాల పరిమాణం అసాధారణంగా ఉన్నట్లు గుర్తించారు.
అయితే అతన్ని పూర్తిగా తనిఖీ చేయడంతో అసలు విషయం బయటపడింది. దాదాపు 100గ్రామల హెరాయిన్ను కండోమ్లో దాచిపెట్టి, దాన్ని ధరించి విమానం ఎక్కేందుకు సిద్దపడ్డట్టు నిర్దారించారు. అమీర్ షాజహాన్ను తమిళనాడులోని రామనాథపురానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
రూ.4కోట్ల ఉండొచ్చని అంచనా
పట్టుబడ్డ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.4కోట్ల వరకూ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. చెన్నైలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో షాజహాన్ పనిచేస్తున్నట్టు గుర్తించారు. ప్రస్తుతం అతను డ్రగ్స్ కంట్రోల్ బోర్డు అధికారుల కస్టడీలో ఉన్నట్టు తెలుస్తోంది.
పట్టుబడ్డ బంగారు కడ్డీలు
ఇక మరో ఘటనలో దుబాయ్ నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికుల వద్ద 4.5కిలోల బంగారు కడ్డీలను అధికారులు గుర్తించారు. ఇద్దరు మహిళలు తమ లగేజీలో బంగారాన్ని దాచి తీసుకొచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ.1.35కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. మహిళలిద్దరిని కేరళకు చెందిన అధిరవ్ వర్గీస్, జెస్సీ వర్గీస్గా గుర్తించారు.