అడ్డంగా దొరికాడు: హార్స్ ట్రైనర్ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ..కథ చాలాఉంది
మైసూరు: ఈ మధ్యకాలంలో అక్రమాస్తులు సంపాదిస్తున్న వారిపై లేదా ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించిన వారిపై ఈడీ కొరడా ఝుళిపిస్తోంది. ఇప్పటికే పలువురు బడా రాజకీయనేతలను టార్గెట్ చేసిన ఈడీ సామాన్యుల ఆస్తులపై కూడా డేగకన్ను వేసింది. తాజాగా మైసూరుకు చెందిన మైఖేల్ ఫ్లాయిడ్ ఈశ్వర్ అనే వ్యక్తి మనీలాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ సీరియస్గా రియాక్ట్ అయ్యింది. మైఖేల్కు చెందిన ఆస్తులను భారీగా అటాచ్ చేసింది. ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల విలువ అక్షరాల రూ. 118 కోట్లు.
మైఖేల్ ఆస్తులు చూస్తే దిమ్మతిరుగుతుంది
మైఖేల్కు సంబంధించిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అందులో 220 ఎకరాల భూమి, మైసూరులో ఓ విలాసవంతమైన బంగ్లా, కేరళలోని వాయనాడ్ జిల్లాలో కాఫీ ఎస్టేట్లను ఈడీ అటాచ్ చేసింది. ఇవన్నీ మైఖేల్కు చెందిన ఆస్తులే అని స్పష్టం చేసింది. 2002 మనీలాండరింగ్ చట్టంను ఉల్లంఘించారని కేసు నమోదు చేయడంతో పాటు మైఖేల్పై చీటింగ్ కేసును కూడా నమోదు చేసింది ఈడీ. అంతేకాదు 70 జంతువుల ట్రోఫీలు, రోజ్వుడ్ ఫర్నీచర్ను సైతం ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.
ఎడ్విన్ను మోసం చేసిన మైఖేల్
స్వతహాగా మైఖేల్ గుర్రపు స్వారీ శిక్షణ ఇస్తుంటారు. అయితే మైసూరు మహారాజ జయచామరాజవడియార్ (1919-1974) వద్ద ఉద్యోగిగా పనిచేసిన ఎడ్విన్ జూబర్ట్ వెనిన్జెన్ అనే బ్రిటీషు వ్యక్తిని మోసం చేసినట్లు తెలుస్తోంది. చనిపోకముందు ట్యాక్సీడెర్మిస్ట్గా మైసూరు మహారాజ వద్ద ఎడ్విన్ పనిచేశారు. అంటే జంతువులు లేదా పక్షుల చర్మంను తీసి ఒకదగ్గర స్టోర్ చేస్తారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ మైఖేల్ను విచారణ చేసింది. అయితే ఎడ్విన్ మృతి తర్వాత అతని పేరిట ఉన్న ఆస్తులపై కన్నేసిన మైఖేల్ ఒక తప్పుడు డెత్ సర్టిఫికేట్ సృష్టించి, నకిలీ డీడ్ పుట్టించి ఎడ్విన్ ఆస్తులను తన పేరు మీదకు మారిపించుకున్నాడని సీఐడీ గుర్తించింది.
సీఐడీ చార్జిషీటు ప్రకారం విచారణ చేసిన ఈడీ
సీఐడీ నమోదు చేసిన చార్జిషీటు ప్రకారం విచారణ ప్రారంభించింది ఈడీ. ఎడ్విన్ బతికున్న సమయంలో మైసూరు మహారాజ జయచామరాజేంద్ర విలువైన కానుకలు బహుమతులతో పాటు ఆస్తులు కూడా ఇచ్చారని మైఖేల్ తెలుసుకున్నట్లు ఈడీ వెల్లడించింది. ఈ బహుమతులు కానుకలు ఆస్తులు 1940 నుంచి 1974 మధ్యకాలంలో ఎడ్విన్కు మహారాజ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎడ్విన్ అవివాహితుడు కావడం, వృద్ధాప్యంలో ఉండటంతో మైఖేల్ కన్ను అతని ఆస్తులపై పడినట్లు చెప్పిన ఈడీ ఇదే అదనుగా తన పేరుతో బదిలీ చేసుకున్నట్లు గుర్తించామని వివరించింది.