లైవ్ టీవీ ప్రోగ్రామ్లో సంచలనం: ఇద్దరు మహిళలను హత్యచేసినట్టు అంగీకారం, సీన్లోకి పోలీసులు
అతనో దోషి, హత్య కేసులో బెయిల్ మీద బయట ఉన్నాడు. అయితే టీవీ చర్చ కార్యక్రమంలో పాల్గొన్నాడు. కార్యక్రమం లైవ్ నడుస్తోంది. ఇంతలో యాంకర్ ప్రశ్నలు వేస్తుండగా.. సమాధానాలు చెప్తున్నాడు. అందులో తాను చేసిన రెండు హత్యల గురించి కూడా చెప్పేశాడు. ఇంకేముంది పోలీసులు రంగప్రవేశం చేసి.. స్టూడియోలో ఉన్న సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. సినీ ఫక్కీలో జరిగిన ఘటనను చూసి నిజమా ? అబద్దమో అని వీక్షకులు పోల్చుకోలేకపోయారు.
వివాహేతర సంబంధం
ఛండీగఢ్కి చెందిన మనీందర్ సింగ్ (31) క్యాబ్ డ్రైవర్గా పనిచేసేవాడు. పదేళ్ల క్రితం అతని భాగస్వామి సరబ్జీత్ కౌర్తో జీవితం సాగుతోంది. అయితే ఆమె తన సోదరి భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తీరు మార్చుకోవాలని మనీందర్ సింగ్ సూచించినా వినిపించుకోలేదు. సరబ్జీత్ తీరుతో విసుగుచెంది న్యూ ఇయర్ వేడుకల కోసం ఛండీగఢ్లో ఓ హోటల్కు తీసుకెళ్లాడు. అక్కడే ఆమెను హత్య చేశాడు. పథకం ప్రకారం సరబ్జీత్ను మట్టుబెట్టాడు.
బెయిల్పై
ఈ కేసులో అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. కింది కోర్టు దోషిగా కూడా తేల్చింది. అయితే హర్యానా హైకోర్టులో బెయిల్ తెచ్చుకున్నాడు. బెయిల్ మీద బయటకొచ్చినా ఆయన.. టీవీ లైవ్ డిబేట్లో పాల్గొన్నారు. అంతకుముందు కర్నాల్లో రేణు అనే యువతిని హత్య చేసినట్టు అంగీకరించారు. ఇక్కడ కూడా సేమ్.. ఆమె కూడా మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని వివరించారు.
లైవ్ జరుగుతుండగానే
టీవీ లైవ్ జరుగుతుండగానే పోలీసులు రంగప్రవేశం చేశారు. నేరుగా స్టూడియోలోకి వెళ్లి.. మనీందర్ను అదుపులోకి తీసుకున్నారు. ఏదీ ఏమైనప్పటికీ టీవీ లైవ్ జరుగుతుండగానే పోలీసులు రావడం, మనీందర్ను అదుపులోకి తీసుకోవడం, అంతా సినీ ఫక్కీలో నిమిషాల్లో జరిగింది. టీవీ చూస్తున్నవారు అదీ నిజమా ? అబద్దమో పోల్చుకోలేకపోయారు. తెరపై లైవ్ కనిపిస్తోన్న నమ్మలేకపోతున్నామని కొందరు అనడమే దీనికి బలం చేకూరుస్తోంది.