భార్య తిరిగి రావాలని పూజలు: హనుమాన్ విగ్రహాం ధ్వంసం
ఇండోర్: మనదేశంలో పిచ్చొళ్లు చాలా మంది ఉన్నారు. దేవుడుని పూజిస్తే అందుకు తగ్గ ప్రతిఫలమివ్వలేదని తాను పూజించిన ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేశాడో మహానుభావుడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో చోటు చేసుకుంది.
ఇండోర్ ఎస్పీ శశికాంత్ కంకనే వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. కుటుంబ కలహాలతో మనోజ్ బంజారా (37) అనే వ్యక్తి భార్య నాలుగు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను తిరిగి ఇంటికి రప్పించేందుకు అతడు చేయని ప్రయత్నం లేదు. అన్ని ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి.
దీంతో చివరకు ఇక తనకు దేవుడే దిక్కంటూ పాల్డాలోని అతి ప్రాచీన పురాతన ఖేడపటి హనుమాన్ ఆలయంలో పూజలు చేశాడు. ఏదో ఒక మిరాకిల్ జరిగి తన భార్యను ఎలాగైనా తన వద్దకు తిరిగి చేర్చేలా కరుణించాలంటూ తన శక్తి మేరకు పూజలు నిర్వహించాడు.
అయినా సరే ఆమె తిరిగి తన వద్దకు రాకపోవడంతో మనస్తాపం చెందిన మనోజ్ బంజారా శనివారం రాత్రి ఆలయంలోని హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితి అదుపు తప్పక ముందే విగ్రహాన్ని ధ్వంసం చేసిన బంజారాను అరెస్ట్ చేశారు.
అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల విచారణలో మనోజ్ బంజారా ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని తేలిందని ఎస్పీ శశికాంత్ వెల్లడించారు. అయితే అతి ప్రాచీన పురాతమమైన ఖేడపటి హనుమాన్ ఆలయంలోని హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేశారన్న వార్త తెలియడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.
విగ్రహా ధ్వంసానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ ఆర్ఎస్ఎస్కు చెందిన ధర్మజాగరణ్ విభాగం స్థానిక కన్వీనర్ వినోద్ మిశ్రాతో పాటు కాయకర్తలు ఆలయం వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని రక్షించేందుకు పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.
హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేశారన్న వార్త పాల్డా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయనే విషయాన్ని ముందుగానే పసిగట్టిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులను భారీగా మోహరించారు.