తాజ్మహల్కు బాంబు బెదిరింపు... ఆ వ్యక్తిని పట్టుకున్న పోలీసులు... ఏం తేల్చారంటే...
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఉన్న ప్రముఖ చారిత్రక కట్టడం తాజ్మహల్కు గురువారం(మార్చి 4) ఉదయం బాంబు బెదిరింపు కాల్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇదంతా వట్టిదేనని తేలిపోయింది. తాజ్మహల్ లోపల,పరిసరాల్లో ఎక్కడా ఎటువంటి బాంబు లేదని పోలీసులు నిర్దారించారు. బాంబు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సతీష్ గణేశ్ నిందితుడి వివరాలు వెల్లడించారు. అతని మానసిక స్థితి సరిగా లేనట్లు కనిపిస్తోందన్నారు. ఎందుకిలా బెదిరింపు కాల్ చేశాడో ఆరా తీస్తున్నామన్నారు. సుమారు 45 నిమిషాల పాటు తాజ్మహల్లో ముమ్మర తనిఖీల తర్వాత తిరిగి పర్యాటకులను అనుమతించినట్లు చెప్పారు. బాంబు లేదని తేలిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కాగా,తాజ్మహల్లో బాంబు పెట్టినట్లు గురువారం ఉదయం పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ వచ్చింది. ఇటీవలి మిలటరీ నియామకాల్లో అవకతవకలు జరగడం తనను బాధించిందని... ఆ కారణంతోనే బాంబు దాడికి పాల్పడుతున్నానని ఆ వ్యక్తి చెప్పాడు.దీంతో అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్, స్థానిక పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. పర్యాటకులను ఖాళీ చేయించి బాంబ్ స్క్వాడ్స్, డాగ్ స్క్వాడ్స్తో విస్తృత తనిఖీలు నిర్వహించారు. చివరకు అక్కడ ఎలాంటి బాంబు లేదని తేల్చారు. బాంబు బెదిరింపు కాల్ చేసిన ఆ వ్యక్తిని ఫిరోజాబాద్లోని కస్గంజ్కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నారు.
ఉదయం 9గంటలకు తాజ్మహల్కు బాంబు బెదిరింపు కాల్ రాగా... ఆ సమయంలో దాదాపు వెయ్యి మంది పర్యాటకులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వారందరినీ హుటాహుటిన బయటకు తరలించారు. ఉదయం 11.15గంటల సమయంలో మళ్లీ పర్యాటకులను అనుమతించారు. బాంబు బెదిరింపు కాల్తో ఆందోళన చెందిన పర్యాటకులు... అంతా వట్టిదేనని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. నిత్యం కొన్ని వేల మంది దేశీ,విదేశీ పర్యాటకులు తాజ్మహల్ను సందర్శిస్తారన్న సంగతి తెలిసిందే. ఇక్కడ నిరంతరం సీఐఎఎస్ఎఫ్ భద్రత ఉంటుంది.