షాకింగ్ : నిప్పు కణికలపై నడుస్తూ.. ఒక్కసారిగా..
జలంధర్ : సాంప్రదాయాల పేరుతో శాస్త్రీయతను పట్టించుకోకుండా.. కేవలం ఒక నమ్మకం ఆధారంగా చేసే కొన్ని చర్యలకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పట్లేదు. ఆచార సాంప్రదాయాలేవైనా మనుషుల పురోగతికి తోడ్పడాలే గానీ మనుషులకు చేటు చేసేవిగా తయారైనప్పుడు ఖచ్చితంగా వాటిపై పున: సమీక్షించుకోవడమే ఉత్తమం.
తాజాగా పంజాబ్ లోని జలంధర్ లో జరిగిన ఓ ఉత్సవ వేడుకల్లో ఓ తండ్రి కూతురు నిప్పుల గుండంలో పడిపోయి ప్రాణాపాయ స్థితికి చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఉత్సవాల సందర్బంగా ఏర్పాటు చేసిన నిప్పుల గుండంలో నడుస్తూ.. ప్రమాదవశాత్తు ఆ తండ్రి, కూతురు ఒక్కసారిగా అందులోనే పడిపోయారు. ఆపై పైకి లేవడం కూడా కష్ట సాధ్యంగా మారడంతో.. ఒంటి నిండా గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన సోమవారం నాడు చోటు చేసుకుంది.
అయితే ఈ అనూహ్య ఘటన పట్ల వెంటనే స్పందించిన అక్కడి వ్యక్తులు తండ్రిని, కూతురుని నిప్పుల గుండం నుంచి బయటకి లాగి, హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సోమవారం ఈ ఘటన జరగ్గా.. ప్రస్తుతం జలంధర్ లోని ఓ ఆసుపత్రిలో ఒంటినిండా గాయాలతో తీవ్ర వేదనను అనుభవిస్తున్నారు.
ఉత్సవాల్లో భాగంగా.. ఓవైపు కిక్కిరిసిన జనం.. చెవులు మారుమోగే కొమ్ము బూరల శబ్ధం.. మరోవైపు నిప్పుల గుండంలో జనం వట్టి పాదాలతో నడవడం.. దేశంలోని చాలా చోట్ల జరిగే ఉత్సవాల్లో కనిపించే పరిస్థితి. ఇంత గందరగోళంలో నిప్పుల గుండం నుంచి నడుస్తున్నప్పుడు అప్పుడప్పుడు ప్రమాదం బారిన పడే అవకాశాలు ఉంటాయి.
గతంలో 2013 లో జరిగిన జలంధర్ ఉత్సవాల్లోను ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుంది. కాగా, అప్పటి ఘటనలో ఓ తల్లి తన కూతురుని ఎత్తుకుని నిప్పుల గుండంలో నడుస్తూ ప్రమాదవశాత్తు అందులోనే పడిపోయింది. దీంతో తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైంది. నిప్పుల గుండంలో నడవడమే చేసిన పాపాలకు పరిష్కారం అని భావించే ప్రజలు ఇలాంటి చర్యలపై పునరాలోచించుకోవాల్సిన అవసరముందంటున్నారు పలువురు.