నిన్న స్విగ్గీ..నేడు జొమాటో: 100కు ఆశపడితే..క్షణాల్లో ఖాతా వేల రూపాయలు మాయం.. ఏం జరిగిందంటే
పాట్నా: ఈ మధ్యకాలంలో ఆన్లైన్ మోసాలు ఎక్కువవుతున్నాయి. బ్యాంకు ఖాతాలకు సంబంధించిన సమాచారం ఎంత గోప్యంగా ఉంచినప్పటికీ హ్యాకర్లకు ఇవేమీ అడ్డుగా నిలవడం లేదు. నిమిషాల్లో ఖాతాలో ఉన్న డబ్బులను మాయం చేస్తున్నారు. తాజాగా పాట్నాకు చెందిన ఓ ఇంజినీర్ ఖాతా నుంచి రూ. 77వేలు మాయమయ్యాయి. ఇంతకీ ఈ ఘరానా మోసం ఎలా జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
జొమాటో కస్టమర్ కేర్ను సంప్రదించిన విష్ణు
బీహార్ రాజధాని పాట్నాలో విష్ణు అనే యువ ఇంజనీర్ ఉన్నాడు. ఓ రోజు విష్ణు ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ద్వారా రూ. 100తో ఆహారం ఆర్డర్ చేశాడు. డెలివరీ బాయ్ వచ్చి ఆహారంను అందజేశాడు. అయితే ఆహారం సరిగ్గా లేకపోవడంతో తిరిగి తీసుకెళ్లాల్సిందిగా డెలివరీ బాయ్కు చెప్పాడు. డెలివరీ బాయ్ మాత్రం రీఫండ్ కోసం జొమాటో కస్టమర్ కేర్ను సంప్రదించాల్సిందిగా కోరాడు. గూగుల్లో జొమాటో కస్టమర్ కేర్ నెంబర్ కోసం వెతికి వచ్చిన నెంబర్కు డయల్ చేశాడు విష్ణు.
రూ.100 రీఫండ్ కోసం రూ.10 ప్రాసెసింగ్ ఫీజ్
గూగుల్లో కస్టమర్ కేర్ నెంబర్ రాగానే వచ్చిన తొలినెంబర్కు డయల్ చేశాడు విష్ణు. ఆ తర్వాత అదే నెంబర్ నుంచి విష్ణుకు ఫోన్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి తను జొమాటో నుంచి కాల్ చేస్తున్నట్లు చెప్పి తాను కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్గా పరిచయం చేసుకున్నాడు. రూ.100 రీఫండ్ ప్రాసెస్ చేయాలంటే తన ఖాతా నుంచి రూ.10 ఛార్జీలుగా వసూలు చేస్తామని చెప్పాడు. అదే సమయంలో ఓ లింక్ పంపుతామని చెప్పిన కాలర్.. ఆ లింక్ను క్లిక్ చేసి ఆ సూచనల మేరకు రూ.10 బదిలీ చేయాలని సూచించాడు.
క్షణాల్లో ఖాతా నుంచి రూ.77వేలు మాయం
విష్ణు మొబైల్కు లింక్ వచ్చింది. వెంటనే మరో ఆలోచన లేకుండా లింక్ను క్లిక్ చేసి రూ.10 ట్రాన్స్ఫర్ చేశాడు. ఈ లావాదేవీ జరిగిన కొద్ది నిమిషాల్లోనే విష్ణు మొబైల్కు మరో మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్ చూసి షాక్కు గురయ్యాడు విష్ణు. రూ.77వేలు తన ఖాతా నుంచి బదిలీ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఇలా ఒక్క ట్రాన్స్సాక్షన్లో కాదు... రెండు మూడు ఆన్లైన్ లావాదేవీలు జరిగాయి. వాటన్నిటికీ సంబంధించిన మెసేజ్లు విష్ణు మొబైల్కు వచ్చాయి. ఈ డబ్బులు మొత్తం పేటీఎం ట్రాన్సాక్షన్స్ రూపంలో జరిగినట్లు గుర్తించారు.
మహిళ ఇదే పద్ధతిలో మోసపోయింది
ఈ ఘటన సెప్టెంబర్ 10న జరిగినట్లు విష్ణు చెప్పారు. అయితే పలుమార్లు పోలీసులను ఆశ్రయించినప్పటికీ తనకు సహకరించడం లేదని వాపోయారు విష్ణు. కొద్ది రోజుల క్రితం కూడా బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఇదే పద్ధతిలో మోసపోయింది. అయితే ఆ సమయంలో ఆమె స్విగ్గీ యాప్ ద్వారా మోసపోయింది. రూ.90వేలకు పైగా ఆమె ఖాతాలో నుంచి డబ్బులు మాయమైయ్యాయి.