చేతివాటం: ఏటీఎంల్లోని రూ. 1 కోటీతో పరార్: మొబైల్ ఫోన్ స్విచ్ ఆప్, సీసీ కెమెరాల్లో చరిత్ర !
బెంగళూరు: ఏటీఎంలో నగదు నిల్వ చేసే వ్యక్తి కోటి రూపాయలు లూటీ చేసి మాయం అయిన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. రూ. 1 కోటితో మాయం అయిన వ్యక్తి కోసం బెంగళూరులోని ఆడుగోడి పోలీసులు గాలిస్తున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఈ విదంగా ఉన్నాయి.
సెక్యులర్ వ్యాల్యూ అనే కంపెనీ ఉద్యోగులు బెంగళూరులోని ఏటీఎంల్లో నగదు నిల్వ చేస్తుంటారు. సెక్యులర్ వ్యాల్యూ కంపెనీలో కిశోర్ కుమార్ (28) అనే యువకుడు ఉద్యోగం చేస్తున్నాడు. మే 1వ తేదీన రూట్ నెంబర్ 1లోని ఏటీఎంల్లో కిశోర్ కుమార్ నగదు నిల్వ చెయ్యడానికి వెళ్లాడు.
మే 2వ తేదీన కిశోర్ కుమార్ ఉద్యోగానికి రాలేదు. కిశోర్ కుమార్ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పై అధికారులు అతని స్థానంలో మరో వ్యక్తిని రూట్ నెంబర్ 1 లోని ఏటీఎంల్లో నగదు నిల్వ చెయ్యాలని సూచించారు. కిశోర్ కుమార్ స్థానంలో ఉన్న వ్యక్తి నగదు తీసుకుని బయలుదేరాడు.
ల్యాంగ్ ఫోర్డ్ రోడ్డులోని ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలో రూ. 47.83 లక్షలు, రత్నాకర్ సహకార బ్యాంకు ఏటీఎంలో రూ. 51.30 లక్షల నగదుతో కిశోర్ కుమార్ మాయం అయ్యాడని సిబ్బంది గుర్తించారు. ఏటీఎం కేంద్రాల్లో సీసీటీవీ కెమారులు పరిశీలించిన అధికారులు చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగదు లూటీ చెయ్యడానికి కిశోర్ కుమార్ కు అతని స్నేహితుడు సహకరించాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కోటి రూపాయల నగదుతో మాయం అయిన కిశోర్ కుమార్, అతని స్నేహితుల కోసం గాలిస్తున్నారు.