కుచేలుడు కుబేరుడయ్యాడు: ఈ వ్యక్తికి వజ్రం దొరికింది..వేలంపాటలో ఎంత ధర పలికిందో తెలుసా..?
అతనో సామాన్య రోజువారీ కూలీ....రెక్కాడితే కానీ డొక్కాడదు. ప్రతిరోజూ కూలినాలి చేస్తే కానీ నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లవు. అంతటి పేదరికంలో ఉన్న వ్యక్తి. అన్ని రోజులు అందరికీ ఒకేలా ఉండవనే విషయం మనందరికీ తెలిసిందే.ఇక ఆ వ్యక్తి రోజు రానే వచ్చింది. కుచేలుడు స్థాయి నుంచి కుబేరుడిగా ఎదిగాడు. ఇంతకీ ఆవ్యక్తి ఎవరు.. నాలుగు ముద్దలు నోట్లోకి వెళ్లేంత కష్టం ఉన్న ఆయన ఒక్కసారిగా కోటీశ్వరుడు ఎలా అయ్యాడు... లాటరీ ఏమైనా తగిలిందా.. లేక అదృష్టం ఆయన తలుపును తట్టిందా తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే...
ప్రజాపతిని వరించిన అదృష్టం
అది మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో ఓ చిన్న గ్రామం. అక్కడ రోజువారీ కూలీ పనిచేసి జీవనం సాగిస్తున్నాడు మోతీలాల్ ప్రజాపతి అనే వ్యక్తి. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం ఆయనది. అలాంటి పరిస్థితిలో ఉన్న ప్రజాపతి ఒక్క రాత్రిలోనే అపరకుబేరుడు అయ్యాడు. ఇంతకీ విషయం ఏమిటంటే ప్రజాపతికి ఓ వజ్రాల గనులు ఉన్న ప్రదేశంలో ఓ వజ్రం దొరికింది. అది 42.59 కారట్ వజ్రం. అంతేకాదు ఇది పన్న వజ్రాల గనుల చరిత్రలోనే అత్యంత విలువైన వజ్రం అని ఆ గనుల అధికారులు స్పష్టం చేశారు.
విమానం మొత్తంలో ఒక్కరే ఉంటే.... ఆ ఛాన్స్ ఆమెకే దక్కింది
వేలంపాటలో రూ.2.55 కోట్లకు పోయిన వజ్రం
వజ్రం దొరకడంతో తన అదృష్టాన్ని నమ్మలేకపోయాడు ప్రజాపతి. వజ్రం ఏంటి నాకు దొరకడం ఏంటి అని ముందు ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత తేరుకున్నాడు. వెంటనే వజ్రాన్ని వేలంపాటకు పెట్టాడు. అంతే ఆ వజ్రానికి రూ.2.55 కోట్లు దక్కాయి. వేలంలో ఇంత భారీ మొత్తం రావడంతో ఆనందం వ్యక్తం చేశాడు . భారీ మొత్తానికి సంబంధించి పన్నులు, ఇతర రాయల్టీలు తగ్గించి మిగతా డబ్బులు ప్రజాపతికి అందజేస్తామని మైనింగ్ అధికారి సంతోష్ సింగ్ చెప్పారు.
వచ్చిన డబ్బును పిల్లల చదువుకోసం వినియోగిస్తా
" నా అదృష్టాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. మా తాతల దగ్గర నుంచి నాలుగు తరాలు వారు ఇక్కడే కాయకష్టం చేసుకుని బతుకుతున్నాం. ఓ పొలం ఇక్కడ కౌలుకు తీసుకున్నాం. అయితే వజ్రాల గనులకు దగ్గరలో పొలం ఉండటంతో వజ్రాల కోసం వేట సాగించని రోజంటూ లేదు. కానీ ఇన్నేళ్లకు దేవుడు మాపై కనికరం చూపాడు. అంతేకాదు అధిక ధర పలికే వజ్రాన్ని మాకు దొరికేలా చేశాడు. ఇప్పుడు వచ్చిన డబ్బును నా పిల్లల చదువుకోసం వినియోగిస్తాను. మా తల్లిదండ్రులకు మంచి జీవితాన్ని ఇస్తాను. నా సోదరుడి కుమార్తెల పెళ్లిళ్లు చేస్తాను. మంచి జీవితం గడుపుతాను" అని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యాడు ప్రజాపతి. అంతేకాదు తన కుటుంబంను పేదరికం నుంచి గట్టెక్కిస్తాను అని చెప్పాడు.