ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే సైకిల్ పై మృతదేహం తరలింపు, ఎందుకంటే?
ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే సరైన సౌకర్యాలు లేని కారణంగా తన సోదరుడి మృతదేహాన్ని ఓ వ్యక్తి సైకిల్ పై తీసుకెళ్ళిన ఘటనపై అసోం ముఖ్యమంత్రి సర్భఆనంద సోనోవాల్ విచారణకు ఆదేశించారు.
గువహాటి: ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే సరైన సౌకర్యాలు లేని కారణంగా తన సోదరుడి మృతదేహాన్ని ఓ వ్యక్తి సైకిల్ పై తీసుకెళ్ళిన ఘటనపై అసోం ముఖ్యమంత్రి సర్భఆనంద సోనోవాల్ విచారణకు ఆదేశించారు.
బలిజయన్ గ్రామానికి చెందిన డింపుల్ దాస్ శ్వాసకోశ వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతదేహం తరలింపు కు ఆసుపత్రి అధికారులు ఏర్పాట్లు చేస్తుండగానే సోదరుడి మృతదేహాన్ని చాపలో చుట్టి సైకిల్ కు కట్టుకొని ఇంటికి బయలుదేరాడని అధికారులు చెబుతున్నారు.
అయితే బాధితుడి గ్రామానికి వాహానాలు వెళ్ళేందుకు రోడ్డు మార్గమే లేదు. ఓ కాలువపై వెదురుబొంగులతో నిర్మించిన బ్రిడ్జిని దాటి ఆ గ్రామానికి చేరుకోవాలి. ఆర్థిక స్థోమత లేకపోవడంతో తమ్ముడి మృతదేహాన్ని చాపలో చుట్టుకొని ఇంటికి తీసుకెళ్ళడంతో అధికారులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
దీంతో ఈ ఘటనపై ముఖ్యమంత్రి సోనోవాల్ విచారణకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
అయితే ఈ ఘటన ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న మజూలి నియోజకవర్గంలోనే జరగడం విశేషం.ఈ విషయాన్ని మీడియా ప్రాచుర్యం కల్పించింది.దీంతో ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు.