కన్న కూతురినే గర్భవతిని చేసిన తండ్రి.. యావజ్జీవ శిక్ష విధించిన కోర్టు
న్యూఢిల్లీ : కన్న కూతురన్న కనీస మానవీయ విలువలకు సైతం తిలోదకాలిచ్చి.. పలుమార్లు కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డ ఓ తండ్రికి యావజ్జీవ శిక్ష ఖరారైంది. సదరు నీచపు తండ్రి వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఢిల్లీ కోర్టు.. అతడికి ఈ శిక్ష విధించింది.
అతను నాశనం చేసింది ఆమె శరీరాన్ని మాత్రమే కాదని, ఆమె ఆత్మను, ఆమె మిగిలిన జీవితాన్ని కూడా నాశనమయ్యేలా చేశాడని కోర్టు అభిప్రాయపడింది. తండ్రి-కూతుళ్ల మధ్య ఉండే అత్యున్నతమైన బంధాన్ని సదరు తండ్రి నీచానికి దిగజార్చాడని పేర్కొంది. తండ్రే పిల్లలను వేధించుకు తినేవాడైతే ఇక ఈ ప్రపంచంలో పిల్లల మనుగడకు అవకాశం లేకుండా పోతుందని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది.
పరిహారాలతో, నాలుగు మాటలతో ఆమెను ఓదార్చలేమని అడిషనల్ సెషన్స్ జడ్జి సంజయ్ శర్మ తీర్పులో భాగంగా వ్యాఖ్యానించారు. కేసుకు సంబంధించి పేర్లను వెల్లడించనప్పటికీ.. ఢిల్లీకి చెందిన ఓ 37ఏళ్ల తండ్రి తన 14ఏళ్ల కూతురిపై ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడి గర్భవతిని కూడా చేశాడు. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
కుమార్తెకు 11ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు తండ్రి. 14ఏళ్ల వయసులో.. 2012లో తల్లితో కలిసి ఇదే విషయంపై తొలిసారిగా ఢిల్లీపోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత బాలిక. ఇంట్లో తల్లి లేని సమయంలో తొలిసారిగా 11ఏళ్ల వయసులో తనపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆ తర్వాత పలుమార్లు తనపై లైంగిక దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది.
విషయం బయటకు పొక్కితే చంపేస్తానని తండ్రి బెదిరించడంతో.. చాలా రోజులు విషయాన్ని ఎవరికీ చెప్పలేదు బాలిక. దీంతో సదరు తండ్రి ఆమెపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. 2012 జూన్ లో తొలిసారిగా విషయాన్ని తన తల్లిగా వివరించడంతో... విషయం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు అతడిని విచారించగా.. చాలారోజుల పాటు ఆరోపణలను ఖండిస్తూ వచ్చాడు. చివరకు నేరం రుజువు కావడంతో.. యావజ్జీవ ఖైదు తప్పలేదు.