రూ.33 కోసం రెండేళ్ల పోరాటం.. రైల్వే నుంచి రిఫండ్ పొందిన కోటావాసి..
Recommended Video
జయ్పూర్ : అన్యాయాన్ని ప్రశ్నించే వాళ్లు తక్కువ మంది ఉంటారు. న్యాయం కోసం అలుపెరగని పోరాటం చేసేందుకు అతికొద్ది మంది మాత్రమే సిద్ధమవుతారు. అలాంటి కోవలోకే వస్తారు రాజస్థాన్ కోటాకు చెందిన ఓ ఇంజనీర్. టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీల రూపంలో ఎక్కువ మొత్తాన్ని వసూలు చేసిన రైల్వేపై రిఫండ్ కోసం రెండేళ్ల పాటు పోరాటం చేశాడు. చివరకు అనుకున్నది సాధించాడు.
ఏసీబీ ఆఫీసర్నని ఫోజు.. మహిళ చేతిలో చెప్పు దెబ్బలుతిన్న కేటుగాడు!(వీడియో)
క్యాన్సిలేషన్ ఛార్జీల్లో తేడా
రాజస్థాన్ కోటా ప్రాంతానికి చెందిన సుజిత్ స్వామి సాఫ్ట్వేర్ ఇంజనీర్. 2017 ఏప్రిల్లో అదే ఏడాది జులై 2వ తేదీకి గోల్డెన్ టెంపుల్ మెయిల్లో కోటా నుంచి ఢిల్లీ వరకు ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకున్నాడు. అప్పటికి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్.. జీఎస్టీ అమల్లోకి రాలేదు. అయితే అనివార్య కారణాల వల్ల సుజిత్ ఆ జర్నీ వాయిదాపడింది. దీంతో టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాడు. టికెట్ ధర రూ.765 కాగా.. ఐఆర్సీటీసీ క్యాన్సిలేషన్ ఛార్జీల కింద రూ.100 రూపాయలు మినహాయించుకుని రూ.665 రూపాయలు రిఫండ్ ఇచ్చింది. అయితే నిబంధనల ప్రకారం రూ.65 మినహాయించుకోవాల్సి ఉండగా.. మరో రూ.35 ఎక్కువ వసూలు చేయడంతో సుజిత్ అవాక్కయ్యాడు.
ఆర్టీఐను ఆశ్రయించిన సుజిత్
ఇక అప్పటి నుంచి రైల్వే శాఖ నుంచి తనకు రావాల్సిన రూ.35 కోసం సుజిత్ స్వామి పోరాటం మొదలుపెట్టాడు. తొలుత ఈ విషయంపై స్పందించిన ఐఆర్సీటీసీ రూ. 35 తిరిగి చెల్లిస్తామని చెప్పింది. అయితే డబ్బు రిఫండ్ కాకపోవడంతో సుజిత్ ఆర్టీఐను ఆశ్రయించాడు. జీఎస్టీ అమలుకు మందే టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా రూ.35 అదనంగా ఛార్జీలు వసూలు చేసిన విషయాన్ని రైల్వే దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ఐఆర్సీటీసీ సర్క్యులర్ నెంబర్ 43 ప్రకారం ఛార్జీలు మినహాయించుకున్నట్లు చెప్పింది. జీఎస్టీ అమలుకు ముందే టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా అప్పటి నిబంధనల ప్రకారం సర్వీస్ ట్యాక్స్ తిరిగి చెల్లించలేదని స్పష్టం చేసింది. అయితే ఆ తర్వాత తీసుకున్న నిర్ణయం మేరకు జీఎస్టీ అమలుకు ముందు బుక్ చేసుకున్న టికెట్ల సర్వీస్ ట్యాక్స్ను తిరిగి చెల్లించాలని నిర్ణయించిందని చెప్పింది. త్వరలోనే సుజిత్కు రూ.35 చెల్లిస్తామని స్పష్టంచేసింది.
రూ.33 వాపసు ఇచ్చిన రైల్వేశాఖ
దాదాపు రెండేళ్ల పాటు ఆర్టీఐ ద్వారా సంప్రదింపులు జరిపిన అనంతరం ఎట్టకేలకూ సుజిత్ విజయం సాధించారు. ఈ ఏడాది మే 1న ఆయన అకౌంట్లో రూ.33 క్రెడిట్ అయ్యాయి. తనను ఇంతగా ఇబ్బంది పెట్టిన రైల్వేశాఖ పరిహారం ఇవ్వకపోగా.. అదనంగా మరో రూ.2 తగ్గించుకోవడంపై సుజిత్ మండిపడుతున్నాడు. రూ. 35ఇస్తానని మాటతప్పిన ఐఆర్సీటీసీపై మళ్లీ ఆర్టీఐ ద్వారా పోరాటం కొనసాగిస్తానని అంటున్నారు సుజిత్.
రూ.3.34కోట్లు నష్టపోయిన ప్యాసింజర్లు
జీఎస్టీ అమలుకు ముందు సర్వీస్ ఛార్జీల పేరుతో రైల్వేశాఖ అక్రమంగా టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు వసూలు చేయడం వల్ల 9లక్షల మంది నష్టపోయినట్లు సుజిత్ ఆర్టీఐ ద్వారా తెలుసుకున్నారు. రైల్వే శాఖ అలా ప్యాసింజర్ల నుంచి రూ.3.34కోట్ల వసూలు చేసినట్లు గుర్తించారు. ఈ విషయం చాలా మంది ప్యాసింజర్లకు తెలియదన్న సుజిత్.. ప్రజల్లో చైతన్యం వస్తేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అంటున్నారు.