భార్య ఆలస్యంగా నిద్ర లేచిందని... ట్రిపుల్ తలాక్ చెప్పి ఇంట్లోంచి గెంటేసిన భర్త!
Recommended Video
లక్నో: ట్రిపుల్ తలాక్తో ముస్లిం మహిళలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. చిన్న చిన్న కారణాలకే భర్తలు తలాక్ చెబుతుండడం వారిని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.
ఉత్తరప్రదేశ్ రాంపూర్లోని అజీంనగర్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన ముస్లిం మహిళల దీన స్థితికి అద్దం పడుతోంది. అజీంనగర్లో నివసిస్తున్న గుల్ అఫ్షాన్ అనే మహిళ ఆలస్యంగా నిద్ర లేచిందని ఆగ్రహించిన ఆమె భర్త ఖాసీం.. ట్రిపుల్ తలాక్ చెప్పి ఆమెను ఇంట్లోంచి గెంటేశాడు.
దీంతో గుల్ అఫ్షాన్ నేరుగా స్థానిక పోలీసుస్టేషన్కు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పి విలపించింది. తన భర్త ఖాసీం మద్యం తాగి వచ్చి రాత్రి తనను కొట్టాడని, ఒళ్లు నొప్పుల కారణంగా ఎక్కువ సేపు నిద్రపోయానని వాపోయింది.
దీంతో ఆమెనుంచి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రిపుల్ తలాక్పై సుప్రీంకోర్టు ఇప్పటికే నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
అయినా ట్రిపుల్ తలాక్ ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా దీనికి సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టింది. అది చట్టరూపం దాల్చితేనైనా ఇలాంటి ఘోరాలు తగ్గుముఖం పడతాయేమో వేచి చూడాల్సిందే.