పాపం ఆమె చేతిలో చితికిపోయాడు.. ఈ భార్యా బాధితుడికి సరైన న్యాయం జరిగింది
హర్యానా: భార్యా భర్తల మధ్య గొడవలు సాధారణమే. అవి కాస్త మితిమీరితే ఎక్కువగా భర్త మీదనే ఫిర్యాదులు రావడం చూశాం. అదే సమయంలో భర్త చిత్ర హింసలకు గురిచేస్తున్నాడని అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ పెళ్లయిన మహిళలు కోర్టులను ఆశ్రయించడం కూడా చూశాం. అయితే భార్యలు వేధిస్తున్నారంటూ కోర్టుకెక్కే భర్తలను చాలా అరుదుగా చూస్తుంటాం. ఇలాంటి భర్తల కోసం భార్యా బాధితుల సంఘాలు కూడా ఏర్పడ్డాయి.
తాజాగా పంజాబ్ హర్యానా ఉమ్మడి హైకోర్టు ఓ భర్తకు విడాకులు మంజూరు చేసింది. ఎందుకు మంజూరు చేసిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.పంజాబ్ హర్యానా ఉమ్మడి హైకోర్టు ఓ భార్యా బాధితుడికి విడాకులు మంజూరు చేసింది. భార్య తనను మానసికంగా వేధిస్తోందంటూ భర్త కోర్టును ఆశ్రయించాడు. తనకు తప్పుడు మెసేజ్ లను పంపుతూ, తన క్యారెక్టర్ పై అపనిందలు వేస్తోందంటూ కోర్టుకు ఫిర్యాదు చేశాడు. ఆమె పెట్టే మెసేజ్ లు తనను మానసిక వేదనకు గురిచేస్తున్నాయంటూ పేర్కొన్నాడు. అంతేకాదు తన కొడుకుతో కూడా చెప్పరాని మెసేజ్ లను మొబైల్ లో పెట్టిస్తోందంటూ కోర్టుముందు ఆవేదన వ్యక్తం చేశాడు.
అమెరికాలో తను మరో మహిళతో సహజీవనం చేస్తున్నాననే పుకార్లు పుట్టించిందని తనకు మరో బిడ్డ కూడా కలిగాడంటూ అబద్ధాలు సృష్టించి తనను మానసికంగా చాలా హింసించిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చాడు. అంతేకాదు తనకు భోజనం పెట్టేది కాదని తన తల్లిదండ్రుల నుంచి వేరుగా వచ్చేయాలని బలవంతం చేస్తోందని కోర్టు దృష్టికి తీసుకొచ్చాడు. పిటిషన్ ను విచారణ చేసిన న్యాయస్థానం ఆ భార్య ఆమె భర్తను చాలా మానసిక వేధింపులకు గురిచేసిందని కోర్టు భావించింది.
భార్య గురిచేసిన మానసిక వేధింపులకు భర్త చాలా నష్టపోయాడని భావించిన కోర్టు అతనికి ఆమె నుంచి విముక్తి కలిగేలా విడాకులు మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. మే 2013లో సోనేపత్ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు భర్త. పిటిషన్ ను జస్టిస్ రాకేష్ కుమార్ జైన్, జస్టిస్ హర్ నరేష్ సింగ్ గిల్ లు విచారణ చేశారు. భార్య వేధింపులకు భర్త ఎంతలా నలిగిపోయాడో ఊహించగలమని చెప్పిన న్యాయస్థానం ఆ భర్తకు భార్యనుంచి విడాకులు మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించింది. ఫిబ్రవరి 1997లో వీరిద్దరికీ వివాహం జరుగగా... వారికి ఒక కొడుకు కూడా ఉన్నాడు.