నిద్రపోతున్నప్పుడు పాట పాడాడని.. గొడ్డలితో అన్నను నరికేశాడు..
సురేశ్ చింతురామ్ ను కొట్టడంతో.. ఇంటి బయటినుంచి గొడ్డలి తీసుకొచ్చిన చింతురామ్ సురేశ్ ను బెదిరించాడు. అయితే అన్న చేతిలోంచి గొడ్డలిని లాక్కున్న సురేశ్..
రాయ్పూర్: ఇద్దరు సోదరుల మధ్య చోటు చేసుకున్న చిన్నపాటి గొడవ చంపుకునేదాకా వెళ్లింది. తోడబుట్టినవాడు అని కూడా చూడకుండా తమ్ముడు అన్నయ్యను దారుణంగా హతమార్చాడు. అది కూడా నడివీధిలో జనమంతా చూస్తుండగానే!
వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్ ఘడ్ బాలద్ జిల్లా దాండిలొహ్రా గ్రామంలో చింతురామ్(45), సురేశ్ కుమార్(40) అనే అన్నదమ్ములు నివసిస్తున్నారు. వీరిద్దరికి పెళ్లిళ్లవగా.. ఇరువురి భార్యలు ఎప్పుడూ గొడవపడుతుంటారు. ఇదే క్రమంలో మంగళవారం మధ్యాహ్నాం నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో అన్నదమ్ముల మధ్య గొడవ చోటు చేసుకుంది.
పడుకుంటున్న సమయంలో చింతురామ్ పాటలు పాడటంతో సురేశ్ అతన్ని వారించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ రేగింది. సురేశ్ చింతురామ్ ను కొట్టడంతో.. ఇంటి బయటినుంచి గొడ్డలి తీసుకొచ్చిన చింతురామ్ సురేశ్ ను బెదిరించాడు. అయితే అన్న చేతిలోంచి గొడ్డలిని లాక్కున్న సురేశ్.. చింతురామ్ ను ఈడ్చుకెళ్లి బయట కరెంటు స్తంభానికి కట్టేశాడు.
ఆపై గ్రామస్తులంతా చూస్తుండగానే అన్న చింతురామ్ ను సురేశ్ ముక్కలు, ముక్కలుగా నరికేశాడు. మధ్యలో ఎవరైనా జోక్యం చేసుకుంటే, వారికి కూడా ఇదే గతి పడుతుందని హెచ్చరించాడు. హత్య అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. సురేశ్ గతంలోను ఇలాగే ప్రవర్తించి స్థానికులను ఇబ్బందులు పెట్టాడని గ్రామ ప్రజలు చెబుతున్నారు.