భార్య చెల్లెలితో అక్రమ సంబంధం.. పక్కనే ఉండి క్రిమినల్స్ని భార్యపైకి ఉసిగొల్పాడు..
పైకి జెంటిల్మెన్లా కనిపించే అతణ్ని నమ్మినందుకు ఆ అత్తమామలకు ఏడుపే మిగిలింది. తమ ఇద్దరు కూతుళ్లనూ దారుణంగా మోసం చేసినవాడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరదలిపై మోజు పెంచుకుని, కట్టుకున్న భార్యను కడతేర్చడానికి సినీఫక్కీలో నాటకమాడిన ఆ రాక్షసుణ్ని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజీలుగానీ దొరకకుంటే వాడు సమాజం దృష్టిలో ఎప్పటికీ జెంటిల్మెన్ లాగానే చెలామణి అయ్యేవాడు..
సినిమా తరహాలో..
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో సంచలనం రేపిన ఈ కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. సిటీలో ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తోన్న వ్యక్తికి ఐదేళ్ల క్రితం పెళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా. భార్య మళ్లీ కడుపుతో ఉంది. ఈనెల 12న భార్యాభర్తలిద్దరూ షాపింగ్ కు వెళ్లారు. చీకటిగా ఉండే పార్కింగ్ ఏరియా వద్ద వారిపై ఓ దోపిడీ గ్యాంగ్ దాడిచేసింది. డబ్బులు, నగలు గుంజుకునే క్రమంలో ఆ గర్భిణిని పొడిచేసి దొంగలు పరారయ్యారు. గాయాలతో బయటపడ్డ భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ రికార్డులు చూసి పోలీసులు విస్తుపోయారు.
మరదలికి దగ్గరై..
కాలేజీ చదువుల కోసం ఇంట్లోనే కలిసుంటోన్న భార్య చెల్లెల్లిని మెల్లగా ముగ్గులోకి దింపాడు. భార్య కళ్లుకప్పి మరదరలితో వివాహేతర సంబంధం కొనసాగించాడు. క్రమంగా భార్యపై మోజు తగ్గి, మరదలితోనే జీవితాంతం కలిసుండాలని భావించాడు. భార్యను అడ్డుతొలగించుకోవాలనుకున్నాడు. అందుకోసం తానే ఓ పథకం వేశాడు. దాన్ని అమలు చేయడానికి ముగ్గురు క్రిమినల్స్ తో డీల్ కుదుర్చుకున్నాడు. సినిమా తరహాలో నకిలీ దాడికి ప్లాన్ చేసి, భార్యను అంతం చేశాడు.
ఆమెతో కలిసుందామనే..
ముసుగులు ధరించిన దోపిడీ దొంగల చేతిలో గర్భిణి హత్య వార్త అన్ని చానెళ్లలో రావడంతో ఘజియాబాద్ పోలీసులు దీన్నొక సవాలుగా తీసుకున్నారు. ఆ ఘటనకు సంబంధించి అన్ని సీసీటీవీ కెమెరాల రికార్డుల్ని పరిశీలించగా.. వ్యక్తి తన భార్యను కాపాడుకోకుండా దొంగలకు సహకరిస్తున్నట్లు కినిపించింది. దీంతో పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించగా నిజాలు కక్కేశాడు. మరదలితో కలిసుందామన్న కోరికతోనే భార్యను హత్య చేయించానని చివరికి అంగీకరించాడు. దోపిడీ ముఠాగా నటించిన ముగ్గురికీ గతంలో నేర చరిత్ర ఉంది. వాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.