బాలుడి కిడ్నాప్..నిర్బంధం..రేప్.. జైలుపాలు: తీహార్ కారాగారంలో ఉరి వేసుకుని ఆత్మహత్య..!
న్యూఢిల్లీ: తీహార్ కేంద్ర కారాగారంలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. అత్యాచారం కేసులో శిక్షను అనుభవిస్తోన్న యువకుడొకరు ఆత్మహత్య చేసుకున్నాడు. మరుగుదొడ్డి కిటికీ ఊచలకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తీహార్ కేంద్ర కారాగారం కాంప్లెక్స్లోని నాలుగో నంబర్ జైలులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ యువకుడి పేరు రాజేష్ కుమార్. 25 సంవత్సరాల రాజేష్ కుమార్ 2016లో న్యూఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలో ఓ బాలుడిని కిడ్నాప్ చేసి, అయిదు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ కేసులో అతనిపై నేరం రుజువు కావడంతో తీహార్ కేంద్ర కారాగారంలో శిక్షను అనుభవిస్తున్నాడు. నాలుగో నంబర్ జైలులో అతను ఉంటున్నాడు. బుధవారం రాత్రి మరుగుదొడ్డికి వెళ్లిన రాజేష్ కుమార్ చాలా సేపటి వరకు తిరిగి రాలేదు. దీన్ని గమనించిన జైలు సిబ్బంది అతని గురించి ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మరుగుదొడ్డి లోపలి వైపున గడియ పెట్టుకుని ఉండటంతో తలుపులను పగులగొట్టారు.
కిటికీ ఊచలకు ఉరి వేసుకున్న స్థితిలో కనిపించాడతను. వెంటనే జైలు సిబ్బంది అతణ్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం తరలించారు. అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. రాజేష్కుమార్ మృతదేహంపై ఎలాంటి పెనుగులాటకు సంబంధించిన ఆనవాళ్లు లేకపోవడం, కిటికీ ఊచలకు ఉరి వేసుకున్న స్థితిలో అతను కనిపించడం వంటి కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడినట్లు తీహార్ జైలు సిబ్బంది ప్రాథమికంగా నిర్ధారించారు.