ఆమె వేదన వర్ణనాతీతం: బెల్టుతో కొట్టి సీలింగ్ ఫ్యానుకి కట్టేశాడు..
లక్నో: ఉత్తరప్రదేశ్ ఉనావ్ రేప్ సంఘటన గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నవేళ.. రాష్ట్రంలో మరో మహిళపై జరిగిన ఆకృత్యం వెలుగుచూసింది. కట్టుకున్న భర్తే కట్నం కోసం అత్యంత అమానవీయంగా వ్యవహరించిన ఈ ఘటన మహిళలపై పేట్రేగుతున్న హింసకు అద్దంపడుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. షాజహాన్ పూర్ లో నివాసముండే ఓ వ్యక్తి కొంతకాలంగా అదనపు కట్నం కోసం భార్యను చిత్రహింసలు పెడుతున్నాడు. ఇదే క్రమంలో రెండు రోజుల క్రితం.. పుట్టింటికి వెళ్లి రూ.50వేలు తీసుకురావాలని ఆమెను బెదిరించాడు. అందుకు ఆమె తిరస్కరించడంతో.. బెల్టుతో విచక్షణారహితంగా చావబాదాడు.
బెల్టు దెబ్బలకు తాళలేక ఆమె స్పృహ కోల్పోయింది. అయినా అతని ఆగ్రహం చల్లారలేదు. ఆపై ఆమె రెండు చేతులను చున్నీతో గదిలోని సీలింగ్ ఫ్యాన్ కి కట్టేశాడు. స్పృహలోకి వచ్చాక.. తాను ఏ పరిస్థితులో ఉన్నానో తెలుసుకుని ఆమె బోరున విలపించింది. ఈ ఉదంతాన్ని అతను సెల్ ఫోన్ లో రికార్డు చేసి.. అత్తింటివారికి పంపించడం గమనార్హం.
ఇదే విషయమై ఆమె మీడియాతో మాట్లాడారు. ' మూడు, నాలుగు గంటల పాటు అతను నన్ను విపరీతంగా కొట్టాడు. స్పృహలోకి వచ్చి చూసేసరికి నా చేతులు సీలింగ్ ఫ్యాన్ కి కట్టేసి ఉన్నాయి' అని చెప్పారు. తాను చదువుకోకపోవడం వల్లే ఇలాంటి దుస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోందని, తన జీవితం నాశనమైపోయిందని ఆమె వాపోయారు.
విషయం తెలుసుకున్న షాజహాన్ పూర్ సీఐ సుమిత్ శుక్లా దీనిపై స్పందించారు. ఆమె భర్తతో పాటు అతని నలుగురు కుటుంబం సభ్యుల మీద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్టు చెప్పారు. బాధితురాలిని ఆమె భర్త విచక్షణారహితంగా కొట్టిన వీడియో తమ దృష్టికి వచ్చిందని, దర్యాప్తును వేగవంతం చేశామని వెల్లడించారు.