ప్రధాని మోదీని చంపేస్తా... ఢిల్లీ పోలీసులకు అగంతకుడి ఫోన్ కాల్...
భారత ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేస్తానని బెదిరిస్తూ ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్కు ఓ అగంతకుడు ఫోన్ కాల్ చేశాడు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆ కాల్పై విచారణ చేపట్టారు. ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని అంబేడ్కర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దక్షిణ్పురికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతని ఇంటి చిరునామా తెలుసుకుని.. అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు.
విచారణలో అతని పేరును పోలీసులు నితిన్గా గుర్తించారు. బెదిరింపు ఫోన్ కాల్ చేసిన సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికీ విచారణ కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
గతంలోనూ ఢిల్లీ పోలీసులకు ఇలాంటి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. గతేడాది జనవరి 18న ముక్తియార్ అలీ(53) అనే వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి ప్రధాని మోదీని దూషించాడు. అంతేకాదు,మోదీని చంపేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కొద్ది గంటల్లోనే అతని చిరునామా తెలుసుకుని అరెస్ట్ చేశారు. మద్యం మత్తులోనే అతను బెదిరింపు ఫోన్ కాల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.అతనిపై కేసు నమోదు చేసింది లేనిది తెలియరాలేదు.