నిర్బంధ గృహంలో మరో వ్యక్తి మృతి..ఇప్పటి వరకు డిటెన్షన్ క్యాంప్లో 29 మంది మృతి
అస్సాం: అక్రమవలసదారులను గుర్తించి ప్రభుత్వం వారిని నిర్బంధ గృహాల్లో ఉంచుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా అక్రమ వలసదారులను గుర్తించి వారిని నిర్భంధ గృహాలకు తరలించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తోంది. అయితే నిర్భంధ గృహాల్లో ఉన్న వ్యక్తులు మృతి చెందడం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా అస్సాంలోని నిర్బంధ గృహంలో ఉన్న ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో డిటెన్షన్ సెంటర్లలో ఉంటూ మృతి చెందిన వారి సంఖ్య 29కి చేరింది.
డిటెన్షన్ సెంటర్లలో ఉన్న వ్యక్తి తీవ్ర అనారోగ్యంకు గురికావడంతో ఆయన్ను గౌహతి మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. గతేడాది అక్టోబర్ నెలలో కూడా ఓ వ్యక్తి మానసిక పరిస్థితి సరిగ్గా లేదంటూ డిటెన్షన్ సెంటర్కు తరలించారు. 2017 అక్టోబర్ 11 నుంచి ఈ 65 ఏళ్ల వ్యక్తి తేజ్పూర్ డిటెన్షన్ సెంటర్లో ఉంటూ మృతి చెందాడు.దీంతో డిటెన్షన్ సెంటర్లపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం అస్సాంలో 6 డిటెన్షన్ సెంటర్లు ఉన్నాయి. అయితే అవి జిల్లా జైళ్లలో ఉన్నాయి. మొత్తం 1000 మంది అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. గోల్పారా జిల్లాలో ఏడో నిర్భంధ గృహం నిర్మిస్తోంది ప్రభుత్వం. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు అస్సాం ప్రభుత్వం 28 మంది అక్రమవలసదారులను గుర్తించింది. వారిని నిర్బంధ గృహాల్లో ఉంచగా వారంతా మృతి చెందారు. అస్సాంలోని ఆరు నిర్బంధ గృహాల్లో 25 మంది మృతి చెందారని జూలైలో కేంద్రమంత్రి చంద్రమోహన్ పటోవారీ సభకు తెలిపారు. ఇక అస్సాం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సమాచారం మేరకు మృతుల్లో ఇద్దరు మాత్రమే బంగ్లాదేశ్ అడ్రస్తో ఉండగా మిగిలినవారందరి ఆచూకీ అస్సాంలో ఉన్నట్లు రికార్డులు తెలుపుతున్నాయని సభకు చెప్పారు.
అనారోగ్యంకు గురైన వీరందరినీ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందారని కేంద్రమంత్రి సభకు తెలిపారు. అయితే చనిపోయిన ఇద్దరు బంగ్లాదేశీయుల మృతదేహాలు మాత్రం ఆ దేశానికి పంపలేదని మంత్రి పటోవారీ చెప్పారు.