షాకింగ్: ఫ్రెండ్స్ వీడియో కోసం గంగలో దూకి...
లక్నో: ఈ మధ్య చాలామందికి సెల్ఫీ, వీడియోల పిచ్చి బాగా పెరిగింది. సెల్ఫీలు తీసుకుంటు మరణించిన వారి గురించి కూడా మనం విన్నాం. అలాగే ఉత్తర ప్రదేశ్లో ఓ వ్యక్తి స్నేహితుల వీడియో కోసం గంగానదిలో దూకి, కనిపించకుండా పోయాడు.
ఈ సంఘటన హరిద్వార్లో జరిగింది. ప్రస్తుతం సామాజిక సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆశిష్ (27) హరిద్వార్ సమీపంలోని గంధ్మీర్పూర్లో ఉంటాడు. గంగా నది దగ్గరకు తన స్నేహితులతో కలసి వచ్చాడు.
అప్పటికే వీరంతా బాగా తాగి ఉన్నారు. తాము మొబైల్ ఫోన్లలో వీడియో తీసుకుంటామని, నదిలోకి దూకాలని స్నేహితులంతా ఆశిష్ను కోరారు. అతను తొలుత తటపటాయించాడు. వారి బలవంతంతో నదిలోకి దూకాడు. ఆ తర్వాత ఎంతసేపటికీ పైకి రాలేదు.
దీంతో ఆందోళనకు గురైన మిత్రులు కాసేపు వెతికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీరు తీసిన వీడియోను కొన్ని టీవీ చానళ్లు ప్రసారం చేశాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గంగా నదిలో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నందున ఆశిష్ కొట్టుకుపోయి ఉంటాడని పోలీసు భావిస్తున్నారు.