అస్సాంలో దారుణం: గోవులను అపహరించాడని ఒకరిని కొట్టి చంపిన స్థానికులు
గోవులను అపహరించేవారిగా భావించి వారిపై కొందరు దాడి చేయడంతో ఒకరు మృతి చెందిన ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఈ ఘటన విశ్వనాథ్ జిల్లా దిప్లుంగా టీ ఎస్టేట్లో చోటుచేసుకుంంది. వివరాల్లోకి వెళితే... సూటీ ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులు టెంపో వ్యాన్లో వెళుతుండగా కొందరు ఆ వ్యాన్పై దాడి చేశారు. ఈ ఘటన తెల్లవారు జామున 4గంటలకు చోటుచేసుకుంది. నలుగురు కలిసి గోవులను అపహరించుకుపోయారంటూ స్థానికులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే దొంగతనం చేయబడ్డ ఆవులను వ్యాన్లో కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి వ్యాన్ డ్రైవర్ పరారయ్యాడు. వ్యాన్లో వెళుతున్న నలుగురిపై దాదాపు 20 మంది కర్రలు, రాడ్లతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. నలుగురిపై దాడి చేస్తున్న వీడియోను అక్కడి స్థానికులు తీశారు. తనను వదిలేయాల్సిందిగా బాధితుడు చేతులు జోడించి బతిమాలాడే దృశ్యాలు వీడియోలో రికార్డ్ అయ్యాయి. అయినా అక్కడి స్థానికులు వదలకుండా చితకబాదారు. మిగతా వారిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దిప్లుంగా టీ ఎస్టేట్ నుంచి కొన్న పందులను కొనుగోలు చేసేందకు బుధవారం తెల్లవారు జామున బయలు దేరినట్లు బాధితుల్లో ఒకరు చెప్పారు. తాము గోవులను దొంగతనం చేసేందుకు వచ్చినట్లు భావించి తమపై కర్రలు రాడ్లతో దాడికి దిగారని బాధితుల్లో ఒకరు చెప్పాడు. అయితే ఈ గ్యాంగ్ మాత్రం గోవులను వ్యానులో తరలిస్తోందని పోలీసులు చెప్పారు. ఇప్పటికైతే బాధితులు గోవులను దొంగలిస్తున్నట్లుగానే కేసును నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పందుల కొనుగోలుకు వెళుతున్నట్లుగా తమ విచారణలో తేలలేదని వారు స్పష్టం చేశారు. ప్రస్తుతం వారు గాయాలపాలైయ్యారని వారి స్టేట్మెంట్ ఇంకా రికార్డు చేయాల్సి ఉందని పోలీసులు చెప్పారు.
బాధితులను దగ్గరలోని విశ్వనాథ్ చరియాలి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా అందులో ఒకరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు . బాధితులంతా గిరిజనులేనని పోలీసులు వెల్లడించారు. వారంతా చుట్టుపక్కల టీఎస్టేట్స్లో పనిచేస్తున్నారని పోలీసులు వివరించారు. వీరిపై దాడిచేసిన వారికోసం గాలిస్తున్నామని చెప్పిన పోలీసులు ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదని చెప్పారు.