వెన్నులో వణుకు : కన్న కూతురిని కడతేర్చిన కసాయి తండ్రి..ముక్కలుగా కోసి, ఇదే కారణం
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఒళ్లు గొగురుపొడ్చే ఘటన ఒకటి వెలుగు చూసింది. ఆటోలో ప్రయాణించిన ఓ ప్రయాణికుడు సూట్కేసును ఆటోలోనే వదిలి వెళ్లిపోయాడు. సూట్ కేసులో నుంచి దుర్వాసన వస్తుండటంతో డ్రైవర్ తెరిచి చూడగా షాక్కు గురయ్యాడు. ఇంతకీ సూట్కేసులో ఏముంది..? వెన్నులో వణుకు పుట్టించే ఈ ఘటన ముంబైకి సమీపంలోని థానేలో చోటుచేసుకుంది.
ప్రేమించిందని కూతురును హత్య చేసిన తండ్రి
థానే నగరం ఉలిక్కి పడింది. సొంత కూతురునే పొట్టనబెట్టుకున్నాడు ఓ తండ్రి. ప్రేమించిన వ్యక్తిని తప్ప మరొకరిని పెళ్లి చేసుకోనని కూతరు చెప్పడంతో జీర్ణించుకోలేని తండ్రి ఆమెను హత్యచేశాడు. హత్య చేశాక ఏం చేయాలి అని చాలాసేపు ఆలోచించాడు. వెంటనే కూతురు శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసేసి పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. శరీరాన్ని మూడు ముక్కలుగా విభజించి ఆపై ముక్కలు ముక్కలుగా కోసేశాడు. సూట్కేసులో ఆ శరీర విడిభాగాలను పెట్టాడు.
సూట్కేసు తీసుకుని ఆటోలో ప్రయాణం
ఇక మృతురాలి విడిభాగాలను సూట్కేసులో ఉంచి ఓ ఆటో మాట్లాడుకున్నాడు. ఆటోలోకి ఎక్కి కాస్త దూరం ప్రయాణించగానే ఏదో దుర్వాసన వచ్చింది. వెంటనే సూట్కేసులో ఏముందని ఆటో డ్రైవర్ ప్రశ్నించగా... ఆ తండ్రి సూట్కేసును ఆటోలోనే వదిలి పరుగులు తీశాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆటో డ్రైవర్. అయితే మృతురాలు కానీ, నిందితుడు కానీ ఎలాంటి క్లూలు ఇవ్వకుండా పారిపోవడంతో థానే క్రైమ్ బ్రాంచ్ విచారణ చేపట్టింది. విచారణ చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిందితుడు అరవింద్ తివారి అని గుర్తించారు. తిత్వాలా ప్రాంతంలో నివాసముంటున్నట్లు చెప్పారు.
నేరం అంగీకరించిన తండ్రి తివారీ
ఇక అరవింద్ తివారీని పట్టుకున్న పోలీసులు అతన్ని విచారణ చేయగా నేరాన్ని అంగీకరించాడు. ఓ వ్యక్తితో ప్రేమలో ఉందని అతను తనకు నచ్చలేదని పలుమార్లు హెచ్చరించినప్పటికీ తన కూతురు అతనితో తప్ప మరొకరిని పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పేయడంతో ఆమెను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు తండ్రి అరవింద్ తివారీ. ప్రస్తుతం కస్టడీలో ఉన్న అరవింద్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సూట్కేసులో మృతురాలి పూర్తి శరీరం లేదని మిగతా భాగం ఎక్కడుందన్న దానిపై విచారణ చేస్తున్నారు.
నిందితుడిని పట్టించిన సీసీ కెమెరాలు
నిందితుడిని గుర్తించడంలో సీసీ కెమెరాలు ప్రధాన పాత్ర పోషించాయి. కల్యాణ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆటో దిగి నిందితుడు పారిపోయాడు. అక్కడి నుంచి సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. తిత్వాలా రైల్వే స్టేషన్లో సూట్కేసుతో తివారీ రైలు ఎక్కాడు. ఆ తర్వాత ఆటోలో ఎక్కిన సీసీ టీవీ ఫుటేజీలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితుడి ఫోటోలు తీసుకుని స్థానికులను అడుగగా నిందితుడిని గుర్తుపట్టి అతని ఇంటిని చూపించారు.
నాలుగు నెలల క్రితమే తండ్రి వద్దకు కూతురు
మృతురాలు నాలుగు నెలల క్రితమే తన సొంత ఊరు అయిన జాన్పూర్ నుంచి తిట్వాలాకు వచ్చిందని పోలీసులు తెలిపారు.నిందితుడు తిట్వాలాలో నివాసముంటుండగా అతని భార్య మరో నలుగురు కుమార్తెలు జాన్పూర్లో ఉంటున్నారు. మృతురాలు డిగ్రీ పూర్తి చేసి ఓ ప్రైవేట్ సంస్థలో క్లర్క్గా పనిచేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఇక్కడే ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారిందని చెప్పారు. ఈ ప్రేమను తండ్రి అంగీకరించకపోవడం, ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగడం తండ్రి ఆమెను హత్యచేయడం జరిగిపోయాయని పోలీసులు తెలిపారు.