ఉపాధ్యాయిని దారుణ హత్య: తరగతి గదిలో ఘాతుకం: తెగ నరికిన యువకుడు
చెన్నై: తమిళనాడులోని కడలూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉపాధ్యాయురాలిపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. అందరూ చూస్తుండగా ఆమెను తెగ నరికాడు. శుక్రవారం ఉదయం జిల్లాలోని కురంజిపాడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన సంభవించింది. మృతురాలి పేరు రమ్య. వయస్సు 23 సంవత్సరాలు.
కురింజిపాడిలోని గాయత్రి మెట్రిక్యులేషన్ స్కూల్ లో ఉపాధ్యాయినిగా పని చేస్తున్నారు. అయిదవ తరగతి విద్యార్థులకు ఆమె గణితాన్ని బోధిస్తారు. అదే గ్రామానికి చెందిన రాజశేఖర్ అనే యువకుడు ఆమెను కొద్దిరోజులుగా ప్రేమిస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని వెంటపడుతున్నాడు. అతని ప్రేమను రమ్య నిరాకరించింది. అక్కడితో ఆగలేదు. నేరుగా రమ్య తల్లిదండ్రులను కూడా కలుసుకున్నాడు. రమ్యను పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొచ్చాడు. వారు కూడా ఇందుకు ఒప్పుకోలేదు.
దీనితో కొంతకాలం నుంచీ అతను రమ్యపై కక్ష పెంచుకున్నాడు. అదను కోసం ఎదురు చూశాడు. శుక్రవారం ఉదయం ఎప్పట్లాగే రమ్య పాఠశాలకు వెళ్లింది. అప్పటికి ఇంకా విద్యార్థులు పెద్ద సంఖ్యలో రాలేదు. ఒంటరిగా తరగతి గదిలో కూర్చుని పుస్తకాలను తిరగేస్తుండగా.. రాజశేఖర్ అక్కడికి వెళ్లాడు. రమ్యతో ఘర్షణ పడ్డాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. ముఖం, మెడపై పొడిచి, పారిపోయాడు.
ఈ దాడిలో రమ్య సంఘటనాస్థలంలోనే ప్రాణాలు వదిలారు. ఈ ఘాతుకాన్ని కళ్లారా చూసిన స్వీపర్.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టమ్ కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. రమ్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. రాజశేఖర్ కోసం గాలిస్తున్నారు. త్వరలోనే అతణ్ణి పట్టుకుంటామని కురింజిపాడి పోలీసులు తెలిపారు.