కన్నతండ్రే కాలయముడు : భార్యపై అనుమానంతో పిల్లలకు విషమిచ్చి, ముఖానికి టేప్ చుట్టి..
ఘాజియాబాద్ : అనుమానం పెనుభూతంలాంటిది. అలాంటి అనుమానంతో ఓ తండ్రి భార్య పిల్లల పాలిట కాలయముడయ్యాడు. భార్యకు అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో పెళ్లాం పిల్లలను దారుణంగా కడతేర్చాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. యూపీ ఘజియాబాద్లో జరిగిన ఈ హృదయ విదారక ఘటన అందరినీ కంటతడి పెట్టించింది.
ఆరేళ్ల క్రితం కనిపించకుండాపోయిన భర్త... అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని..
భార్యపై అనుమానంతో గొడవలు
ఘజియాబాద్ జిల్లా ముసూరీ పరిథిలోని శతాబ్దిపురానికి చెందిన గురుకు భార్య, ముగ్గురు పిల్లులున్నారు. బాధ్యతలను గాలికొదిలేసిన గురు పనిపాటా లేకుండా తిరిగేవాడు. ఎయిమ్స్లో నర్సుగా పనిచేసే భార్య కుటుంబాన్ని నడిపేది. పని చేయకపోయినా పలువురు మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్న గురు.. తనలాగే భార్య కూడా వేరే వారితో సంబంధాలు పెట్టుకుని ఉంటుందని అనుమానించేవాడు. ఇదే కారణంతో తరుచూ భార్యను వేధిస్తూ గొడవపడేవాడు.
పిల్లల నోట్లో విషం పోసి, ముఖానికి టేప్ చుట్టి
గురువారం రాత్రి సైతం గురు భార్యతో ఘర్షణ పడ్డాడు. ఆగ్రహంతో రగిలిపోయిన ఆ కర్కోటకుడు పెళ్లాం పిల్లల్ని కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. ప్లాన్ ప్రకారం ముందుగా భార్యను చంపేశాడు. ఆ తర్వాత ముగ్గురు పిల్లలకు విషం తాగించాడు. వారు దాన్ని బయటకు ఉమ్మేయకుండా ఉండేందుకు ముఖానికి టేప్ చుట్టాడు. దీంతో పిల్లలు విష ప్రభావంతో పాటు ఊపిరాడక ప్రాణాలు వదిలారు. నలుగురిని చంపిన అనంతరం ఆ దుర్మార్గుడు సైతం ఆత్మహత్య చేసుకున్నాడు.
అనుమానంతోనే చంపేశానని నోట్
స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గురు రాసిన సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. భార్యపై అనుమానంతోనే ఆమెతో పాటు పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆ దుర్మార్గుడు అందులో రాశాడు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో శతాబ్దిపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.