ఢిల్లీలో దారుణం: భార్యను హతమార్చాడు..కూతురుతో పాటు మృతదేహం పక్కనే ఒకరోజు మొత్తం కూర్చున్నాడు
దేశ రాజధాని ఢిల్లీలో నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి తన భార్యను హత్యచేసి మృతదేహం పక్కనే తన రెండేళ్ల కూతురితో 24 గంటలపాటు కూర్చున్నాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లి తాను లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
అనుమానమే పెనుభూతంగా మారింది
ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... ఢిల్లీలోని కమలా మార్కెట్ ప్రాంతంలో నివాసముండే కమిల్ అని వ్యక్తి తన భార్య రేష్మను హత్య చేశాడు. కమిల్ రేష్మలకు మూడేళ్ల క్రితం వివాహమైంది. తన భార్య రేష్మ మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానం రావడం అది కాస్త బలపడటంతో దంపతులు ఇద్దరి మధ్య ప్రతిరోజు గొడవ జరిగేది. ఇది కాస్త పెద్దగొడవగా మారింది. దీంతో అక్టోబర్ 18న రేష్మ తన కూతురును తీసుకుని పుట్టింటికి వెళ్లింది. అయితే మరుసటి రోజే తిరిగి తన ఇంటికి చేరుకుంది. ఆమె వచ్చాక కూడా మరోసారి ఇద్దరు గొడవపడ్డారు. ఈ క్రమంలోనే కమిల్ రేష్మా గొంతును నులిమి చంపేశాడు.
మృతదేహం పక్కనే కూతురుతో పాటు 24 గంటలు కూర్చున్నాడు
రేష్మా చనిపోయిన తర్వాత మృతదేహం పక్కనే తన రెండేళ్ల కూతురితో కూర్చున్నాడు. ఇలా 24 గంటల పాటు కమిల్ కూర్చున్నాడు. అనంతరం పోలీసు స్టేషన్కు వెళ్లి తన భార్యను హత్య చేసినట్లుగా చెప్పాడు. అయితే తాగిన మత్తులో ఏదో వాగుతున్నాడని పోలీసులు అనుకున్నారు. కానీ పదే పదే నొక్కి చెప్పడంతో పోలీసులు కమిల్తో పాటు తన ఇంటికి వెళ్లారు. అక్కడ చూసి వారు షాక్కు గురయ్యారు. చాప పై రేష్మా మృతదేహం ఉంది. గొంతు నులిమి చంపిన ఆనవాలు కనిపించాయి. ఆమె ముఖం నీలం రంగులోకి మారిపోయింది. వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లోక్నాయక్ హాస్పిటల్కు తరలించారు.
ఇష్టపడి ఒకరితో శృంగారం, రెండో వ్యక్తి రేప్ ప్రయత్నం: నగ్నంగా మూడో అంతస్తు నుంచి దూకిన యువతి
అదనపు కట్నం కోసం వేధించేవాడు
ఇదిలా ఉంటే తమ కూతురుని అదనపు కట్నం కోసం కమిల్ వేధించేవాడని రేష్మా తల్లిదండ్రులు తెలిపారు. ప్రతిరోజు తాగొచ్చి గొడవ పడుతుండేవాడని ఇలా తమ కూతురు పలుమార్లు పుట్టింటికి వచ్చి తన బాధను చెప్పుకొనేదని రేష్మా తల్లిదండ్రులు వెల్లడించారు. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కమిల్ పై హత్య, మరియు అదనపు కట్నం కోసం వేధింపుల కేసును నమోదు చేశారు. ఇక తన రెండేళ్ల కూతురును తమతో తీసుకెళ్లేందుకు రేష్మా తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ... కమిల్ తల్లిదండ్రులకు కూతురును అప్పగించారు పోలీసులు.