జీన్స్, టీషర్టు వేసుకుందని భార్యను చంపేశాడు
పూణె: చెప్పిన మాట వినకుండా జీన్స్ ప్యాంటు, టీషర్టులు వేసుకుంటున్నదని భార్యను అతి దారుణంగా హత్య చేసిన సంఘటన పూణె నగరంలో జరిగింది. భార్యను హత్య చేసి పరారైన భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పూణెలోని గుల్తెకేడి ప్రాంతంలో రంజిత్ నిషాద్ (24), పూజ (21) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇటివలే వివాహం అయ్యింది. దంపతులు ఇద్దరూ అన్యోన్యంగా ఉండేవారు. పూజకు వివాహం జరగకముందు నుంచి జీన్స్ ప్యాంటు, టీషర్టులు వేసుకునే అలవాటు ఉంది.
వివాహం జరిగిన తరువాత పూజ అప్పుడప్పుడూ జీన్స్ ప్యాంటు, టీషర్టులు వేసుకుంటున్నది. సాంప్రదాయ విరుద్దంగా నీవు జీన్స్ వేసుకుంటున్నావని రంజిత్ నిషాద్ భార్య పూజతో గొడవపడేవాడు. ఈ విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
గత వారం ఇదే విషయంలో గొడవపడిన రంజిత్ భార్య పూజను పట్టుకుని చితకబాదేశాడు. ఆమె సృహతప్పి కిందపడిపోయింది. అయినా అతని ఆవేశం చల్లారలేదు. పదేపదే దాడి చెయ్యడంతో పూజ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
భార్య మరణించిందని రంజిత్ ధ్రువీకరించుకున్నాడు. మృతదేహాన్ని మంచం కింద దాచిపెట్టి ఇంటి బయట తాళం వేసి అక్కడి నుంచి పరారైనాడు. రంజిత్ ఇంటి నుంచి దుర్వాసన వస్తున్న విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు వెళ్లి తాళం పగలగొట్టి చూడగా పూజ హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. మృతదేహం కుళ్లిపోయి ఉందని, పూజ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి పరారైన రంజిత్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.