కిడ్నాపర్ అనే అనుమానంతో కొట్టి చంపారు
అలీపూర్దువార్ : బెంగాల్లో దారుణం జరిగింది. సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు చూసి జనం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు. ముఖ్యంగా పిల్లల్ని ఎత్తుకుపోయే వారన్న అనుమానంతో అమాయకులపై దాడులకు పాల్పడుతూ వారి ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా బెంగాల్లో ఇలాంటి ఉదంతమే వెలుగుచూసింది. అనుమానాస్పదంగా కనిపిస్తున్నాడని ఓ వ్యక్తిని జనం కొట్టి చంపారు.
యువకుడిని కాటేసిన పాము.. మద్యం మత్తులో ఉన్న అతను ఏం చేశాడంటే..
బెంగాల్లో అలీపూర్ దువార్ ప్రాంతంలోని తసతి టీ గార్డెన్ వద్ద ఓ వ్యక్తి తిరుగుతూ కనిపించాడు. అయితే పిల్లల్ని ఎత్తుకెళ్లే వ్యక్తి అయి ఉండొచ్చన్న అనుమానంతో కొంత మంది అతని వద్దకు వెళ్లి ప్రశ్నించారు. సదరు వ్యక్తి సరైన సమాధానం ఇవ్వకపోవడంతో జనం ఒక్కసారిగా అతనిపై దాడికి దిగారు. పిడిగుద్దులు కురిపిస్తూ, కాళ్లతో తంతూ నరకం చూపించారు. అంత మంది ఒక్కసారిగా కొట్టడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకుని పోలీసులు అక్కడికి చేరుకునేసరికి జరగాల్సిన నష్టం జరిగింది.
తీవ్రగాయాలపాలైన వ్యక్తిని పోలీసులు బిర్పారా హాస్పిటల్కు తరలించారు. అయితే అప్పటికే అతను చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. మూక దాడిలో మృతి చెందిన వ్యక్తి ఎవరన్నది ఇంకా తెలియలేదు. పోలీసులు అతని వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. దాడికి సంబంధించి 17 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని విచారిస్తున్నారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.