కలకలం: సెక్రటేరియట్ ముందు నమాజ్ చేసిన వ్యక్తి... మోడీకి వ్యతిరేకంగా నినాదాలు
ఉత్తర్ ప్రదేశ్ సెక్రటేరియట్ ముందు శుక్రవారం సాయంత్రం కాస్త గందరగోళ వాతావరణం నెలకొంది. ఓ వ్యక్తి తన నడుముకు కత్తిని కట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. అంతకుముందు సెక్రటేరియట్ ఎదురుగా నమాజ్ చేశాడు. దీంతో కాసేపు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ఘటన జరిగిన సమయంలో యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వ ఉన్నతాధికారులతో సెక్రటేరియట్లో సమీక్ష జరుపుతున్నారు.
గందరగోళ పరిస్థితికి కారణమైన మనిషిని రఫీక్ అహ్మద్గా పోలీసులు గుర్తించారు. ఈయన స్థానికంగా ఉన్న మసీదులో మతపెద్ద. రఫీక్ చేసిన పనికిగాను ఆయన్ను అరెస్టు చేయాల్సిందిగా సీనియర్ ఎస్పీ కలానిధి నైతానీ ఆదేశాలిచ్చారు. బాస్ ఆదేశాలు అందుకున్న పోలీసులు రఫీక్ అహ్మద్ను అర్థరాత్రి అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నడిరోడ్డుపై న్యూసెన్స్ చేసినందుకుగాను రఫీక్ను అరెస్టు చేసినట్లు ఎస్పీ కళానిధి తెలిపారు. అంతేకాదు ఘటనను సీరియస్గా తీసుకున్న ఎస్పీ ఇద్దరు కానిస్టేబుల్స్ను సస్పెండ్ చేశారు. రఫీక్ అంత అలజడి సృష్టిస్తున్న సదరు కానిస్టేబుల్లు అలాగే చూస్తూ ఉండిపోయారు తప్ప అతన్ని ఆపుదామన్న ఆలోచన చేయలేదని వెల్లడించారు. రఫీక్ ఘటన మొత్తం అక్కడే ఉన్న మీడియా కవర్ చేసింది.
రఫీక్ ప్రవర్తనతో ట్రాఫిక్ దాదాపు 20 నిమిషాలు నిలిచిపోయింది. సీఎం సెక్రటేరియట్ భవనం చాలా భద్రతతో కూడిఉంటుంది. అంతేకాదు నిత్యం ఆ భవనం దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఉంటారు. ఇలా వచ్చిన రఫీక్ నమాజ్ చేసి ఆ తర్వాత ఆయన మోటార్ సైకిల్ పై అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే అక్కడ రఫీక్ నమాజ్ చేస్తుండటంతోనే తాము ఏమీ చేయలేకపోయామని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం సెక్రటేరియట్ చుట్టు గట్టి భద్రతను ఏర్పాటుచేశామని ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కావని సీఐ అభయ్ మిశ్రా తెలిపారు.