ఆన్లైన్లో ఫోను ఆర్డిచ్చాడు.. పార్శిల్ తెరచి చూస్తే షాక్
ఔరంగాబాద్ : అసలే పండగ సీజన్.. దీనికి తోడు అన్ని ప్రముఖ షాపింగ్లు ఆఫ్లర్ల మీద ఆఫర్లు ప్రకటించేస్తున్నాయి. అంతే స్థాయిలో ప్రజలు కూడా ఆఫర్లను అందుకునేందుకు ఎగబడుతున్నారు. ఇక ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్స్ అయితే విపరీతమైన ఆఫర్లతో కస్టమర్స్ను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే కస్టమర్లు కూడా తమకు కావాల్సిన వస్తువులను ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చేసుకుంటున్నారు. ఇంతవరకు స్టోరీ బాగానే ఉంది. ఆర్డర్ ఇచ్చిన వస్తువు ఇంటికి డెలివరీ కాగానే షాక్కు గురవుతున్నాడు సదరు కస్టమర్. తను ఆర్డర్ చేసింది ఒకటైతే డెలివరీ అయ్యే వస్తువు మరొకటిగా ఉంది. మరికొన్ని ఘటనల్లో అయితే ఒక వస్తువు ఆర్డరిస్తే... ఆ వస్తువు రాకపోగా... రాళ్లు రప్పలు పార్శిల్లో దర్శనమిస్తున్నాయి.
మహారాష్ట్రలో నివాసముంటున్న గజానన్ కారత్ ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్లో మొబైల్ ఫోన్ ఆర్డర్ ఇచ్చాడు. ఇందుకు డబ్బులు కూడా ఆర్డర్ ఇచ్చే సమయంలోనే కట్టేశాడు. మొత్తం రూ.9,134 ఆన్లైన్లో కట్టాడు. ఇంతవరకు బాగానే ఉంది స్టోరీ. ఇక ఆన్ లైన్లో ఆర్డర్ ఇచ్చిన ఫోన్ కోసం ఎదురు చూశాడు గజానన్ కారత్.
ఒకరోజు పార్శిల్ వచ్చిందంటూ డెలివరీ బాయ్ గజానన్ కారత్కు ఫోన్ చేశాడు. ఫోన్ వచ్చిందన్న ఆనందంలో పార్శిల్ను తెరిచి చూడగా షాక్కు గురయ్యాడు. వచ్చింది ఫోన్ కాదు... పార్శిల్లో ఉన్నది ఒక పెద్ద ఇటుక. ఇక ఏమిచేయాలో తెలియక ఎవరిని సంప్రదించాలో తోచక పోలీసులను ఆశ్రయించాడు గజానన్. తాను ఆన్లైన్లో ఫోన్ ఆర్డరిస్తే ...వచ్చిన పార్శిల్లో ఇటుకు ఉందంటూ ఫిర్యాదు చేశాడు. తాను డబ్బులు కూడా కట్టినట్లు పోలీసులకు వెల్లడించాడు. తన మొబైల్కు వచ్చిన మెసేజ్ను కూడా చూపించాడు.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. డెలివరీ బాయ్కు ఫోన్ చేస్తే తను వచ్చిన పార్శిల్ ఇవ్వడం వరకే తన డ్యూటీ అని తెలిపాడు. పార్శిల్లో ఏముందో లేదో తమకు తెలియదని డెలివరీ బాయ్ పోలీసులకు తెలిపాడు.