భరణం: మాజీ భార్యకు నాణేలు మూట ఇచ్చిన వ్యక్తి
అహ్మదాబాద్: మాజీ భార్య భరణం అడిగినందుకు.. దానిని నిరసిస్తూ ఓ వ్యక్తి ఏకంగా రూ.10,000 నాణేలు తీసుకు వచ్చాడు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. భార్యకు విడాకులు ఇవ్వడంతో... నెలకు కొంత చొప్పున భరణం ఇవ్వాలని ఓ భర్తను కోర్టు ఆదేశించింది.
అయితే ఆ తీర్పును నిరసిస్తూ... అతను పదివేల రూపాయల విలువ చేసే నాణేల మూటను తెచ్చిలెక్కించుకోమని చెప్పాడు. అహ్మదాబాద్కు చెందిన పృథ్వి ప్రజాపతి స్థానికంగా చిన్న వ్యాపారం చేస్తుంటాడు. మనస్పర్థల కారణంగా పృథ్వి 2011లో తన భార్య రమీలా బెన్తో విడిపోయాడు.
అయితే ఈ విషయమై రమీలా కోర్టును ఆశ్రయించింది. దీంతో రమీలా అవసరాల నిమిత్తం పృథ్వి ప్రతి నెలా ఆమెకు రూ.1500 చొప్పున భరణం ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది. అయితే గత ఏడాది కాలంగా పృథ్వి అతని మాజీ భార్యకు నెలనెలా డబ్బులు ఇవ్వలేదు.
దీంతో మాజీ భార్య రమీలా కుటుంబ న్యాయస్థానంలో కేసు పెట్టింది. విచారించిన కోర్టు.. పృథ్వి రూ.10వేలను కోర్టు ప్రాంగణంలో ఇవ్వాలని చెప్పింది. దీంతో అతను నగదును నాణేల రూపంలో తీసుకొచ్చాడు. రూ.10వేలు విలువ చేసే నాణేల మూటను తీసుకొచ్చి.. మాజీ భార్యకు అందించి లెక్కపెట్టుకోమన్నాడు. మనస్తాపం చెందిన రమీలా డబ్బు మూటను తీసుకోకుండానే కోర్టు నుంచి వెళ్లిపోయింది.