విషం కలిపిన జ్యూస్ భార్య, కుమారుడికి ఇచ్చి: ఎంతకష్టమొచ్చిందో !
బెంగళూరు నగరంలో మిథున్ (32) అనే వ్యక్తి విషం కలిపిన జ్యూస్ భార్య రోజా (25), కుమారుడు గగన్ (4)తో కలిసి తాగడంతో అతనితో పాటు కుమారుడు మృతి చెందగా రోజా ఐసీయూలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతోంది.
బెంగళూరు: జీవితంపై విరక్తి చెందిన వ్యక్తి భార్య, నాలుగేళ్ల కుమారుడితో కలిసి విషం తాగడంతో భర్త, చిన్నారి మృతి చెంది భార్య మృత్యువుతో పోరాడుతున్న ఘటన బెంగళూరులోని యలహంక పోలీస్ స్టేషన్ పరిధిలోని అళ్లాలసంద్రలో జరిగింది.
అళ్లాలసంద్రలోని నారాయణప్ప లేఔట్ లో నివాసం ఉంటున్న మిథున్ (32) యలహంకలో చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. భార్య రోజా (25), కుమారుడు గగన్ (4)తో కలిసి నివాసం ఉంటున్నాడు. గురువారం ఇంటి నుంచి ఎవరూ ఎంతసేపటికీబయటకురాలేదు.
అనుమానం వచ్చిన స్థానికులు యలహంక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తులుపులు విరగొట్టి చూడగా గగన్ తో దంపతులు అచేతనస్థితిలో పడి ఉన్న విషయం గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే మిథున్, ఆయన కుమారుడు గగన్ మృతి చెందారని వైద్యులు చెప్పారు. కొన ఊపిరితో ఉన్న రోజాకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అప్పుల బాధతోనే వీరు విషం కలిపిన జ్యూస్ సేవించారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. 9 నెలల క్రితమే మిథున్ తుమకూరు నుంచి కుటుంబ సభ్యులతో కలిసి యలహంక చేరుకుని చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడని పోలీసులు తెలిపారు.