Viral video : భార్య శీలాన్ని శంకించి... సలసల కాగె నూనెలో... మహారాష్ట్రలో దారుణం....
మహారాష్ట్రలో అమానుష ఘటన వెలుగుచూసింది. భార్య శీలాన్ని శంకించిన ఓ అనుమానపు భర్త ఆమె పట్ల దుర్మార్గంగా వ్యవహరించాడు. పాతివ్రత్యం నిరూపించుకోవాలని ఆమెకు దారుణ పరీక్ష పెట్టాడు. సలసల కాగె నూనెలో చేతులు పెట్టించాడు. భర్త అనుమానం,సూటిపోటి మాటలు తాళలేక ఆమె కూడా వెనక్కి తగ్గలేదు. ఈ ఘటనలో ఆమె చేతికి గాయాలయ్యాయి. ఈ తతంగం మొత్తాన్ని భర్తే వీడియో తీయడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అసలేం జరిగింది...
మహారాష్ట్రలోని ఉస్మానాబాద్కి చెందిన భార్యాభర్తలు ఈ నెల 11న గొడవపడ్డారు. ఆ గొడవ తర్వాత చెప్పా పెట్టకుండా భార్య ఇంట్లో నుంచి ఎక్కడికో వెళ్లిపోయింది. డ్రైవర్గా పనిచేసే ఆమె భర్త నాలుగు రోజులు వెతికాడు. అయినా ఆమె ఆచూకీ దొరకలేదు. ఐదు రోజు ఆమె ఇంటికి తిరిగొచ్చింది. ఆరోజు ఇంట్లో నుంచి వెళ్లిపోయి పరందాలోని ఖాచాపురి చౌరస్తాకు వెళ్లానని... బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తనను బలవంతంగా బండిపై ఎక్కించుకుని తీసుకెళ్లారని భర్తతో చెప్పింది.
భర్త అనుమానం... భార్యకు ఆ పరీక్ష...
నాలుగు రోజుల పాటు ఆ వ్యక్తులు తనను నిర్బంధించారని... ఎలాగోలా వారి చెర నుంచి బయటపడ్డానని భర్తకు చెప్పింది. కానీ భర్తకు ఆమె మాటలు నమ్మశక్యంగా అనిపించలేదు. తమ సంప్రాదాయం ప్రకారం శీలపరీక్ష ఎదుర్కోవాల్సిందేనని భార్యకు చెప్పాడు. సలసల కాగె నూనెలో ఒక నాణెం వేసి.. దాన్ని తీయాలని కోరాడు. చేతులు కాలకుండా నాణేన్ని బయటకు తీస్తేనే నీ పాతివ్రత్యం నిలుపుకున్నట్లు అని చెప్పాడు. భర్త మాటలు భరించలేక నూనెలో చేతులు పెట్టి నాణెం తీయబోయిన ఆమె చేతులకు గాయాలయ్యాయి.
అతనిపై చర్యలకు డిమాండ్....
ఆమె నూనెలో చేతులు పెడుతున్న సమయంలో తన సెల్ఫోన్తో వీడియో కూడా చిత్రీకరించాడు.'నా భార్యను ఓ వ్యక్తి,ఓ పోలీస్ నాలుగు రోజులు నిర్బంధించారని ఆమె చెబుతోంది. కానీ వాళ్లేమీ చేయలేదని అంటోంది. ఆమె చెప్తున్నది నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఈ పరీక్ష పెట్టాను.' అని అతను పేర్కొనడం వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఘటనపై స్పందించిన మహారాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ నీలం గొర్హె అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రిని డిమాండ్ చేశారు.