నడి రోడ్డులో కత్తితో దాడి చేసి రూ. 17 లక్షలు లూటీ
రాజ్కోట్: స్కూటర్ మీద వెళుతున్న యువకుడిని అడ్డగించిన దుండుగులు అతని మీద కత్తితో దాడి చేసి రూ. 17 లక్షలు లూటీ చేసిన సంఘటన గుజరాత్ లోని రాజ్ కోట్ నగరంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
రాజ్ కోట్ లోని ప్రయివేటు కంపెనీలో సునీల్ లాల్ ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం సునీల్ లాల్ సాటి ఉద్యోగితో కలిసి రాజ్ కోట్ లోని బ్యాంకులోకి వెళ్లారు. కంపెనీ అకౌంట్ నుండి రూ. 37 లక్షలు డ్రా చేశారు. తరువాత అక్కడే సునీల్ రూ. 17 లక్షలు బ్యాగ్ లో పెట్టుకున్నాడు.
సునీల్ సాటి ఉద్యోగి రూ. 20 లక్షలు తీసుకుని బైక్ లో వెళ్లి పోయాడు. సునీల్ రూ. 17 లక్షలు తీసుకుని స్కూటర్ లో కంపెనీ దగ్గరకు బయలుదేరాడు. మార్గం మద్యలో ముగ్గురు దుండగులు సునీల్ స్కూటర్ ను అడ్డగించారు. తరువాత నగదు ఇవ్వాలని బెదిరించారు.
సునీల్ నిరాకరించడంతో వారి మద్య ఘర్షణ జరిగింది. అదే సమయంలో నిందితులు కత్తి తీసుకుని సునీల్ ఎడమ చేతి మీద దాడి చేసి నగదు ఉన్న బ్యాగ్ లాక్కోని అక్కడి నుండి పరారైనారు. సునీల్ మీద దాడి చెయ్యడం, నగదు ఉన్న బ్యాగ్ లాక్కోని పారిపోతున్న దృశ్యాలు అదే ప్రాంతంలోని ఇంటికి ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలలో రికార్డు అయ్యాయని పోలీసులు తెలిపారు.