షాకింగ్: మొక్కతో సెల్ఫీ దిగాడు.. జైలుపాలయ్యాడు, అసలేం జరిగిందంటే...
చెన్నై: వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం... సెల్ఫీకాలం. ఏం ఆశ్చర్యంగా ఉందా? నిజంగా ఇది సెల్ఫీకాలమేనండీ... మొబైల్ చేతిలో ఉంటే చాలు.. మన కుర్రకారుకు పట్టపగ్గాలుండవు కదా.
ఇక వీళ్ల సెల్ఫీ పిచ్చి చూడాలి. ఎక్కడబడితే అక్కడ ఠపీ ఠపీమని ఫొటోలు తీయడం మొబైల్ నుంచే సోషల్ మీడియాలోకి అప్లోడ్ చేయడం. ఇదే ఇప్పటి యూత్ ఫ్యాషన్.. లేటెస్ట్ ట్రెండ్. పాపం.. ఈ లేటెస్ట్ ట్రెండే ఈ యువకుడిని జైలుపాలు చేసింది.
అవును, తమిళనాడులో సెల్ఫీ పిచ్చి ఓ కుర్రాడిని జైలుకు పంపింది. తెలియక చేసిన పనికి తన ఫ్రెండ్తో కలిసి జైలు ఊచలు లెక్కబెట్టాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే... చెన్నై వీఎమ్ స్ట్రీట్కు చెందిన శశికుమార్... దర్గా వీధిలోని తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు.
అక్కడ అటు ఇటు తిరుగుతూ యధాలాపంగా ఆ ఇంటి టెర్రస్ పైకి వెళ్లాడు. అక్కడ కుండీల్లో ఉన్న పలు రకాల మొక్కలు, పూలచెట్లు అతడి కంటికి అందంగా కనిపించాయి. ఇంకేముంది జేబులోంచి మొబైల్ బయటకు తీశాడు. సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా గడిపాడు.
ఫ్రెండ్ ఇంటి నుంచి వెళ్లాక అక్కడ తీసుకున్న ఫోటోలన్నీ ఫేస్బుక్లోకి అప్లోడ్ చేశాడు. చివరికి ఓ మొక్కతో దిగిన ఈ సెల్ఫీనే అతడ్ని జైలుపాలు చేసింది. ఇంతకీ శశికుమార్ చేసిన తప్పెంటో తెలుసా... గంజాయి మొక్కతో కలిసి ఫోజు ఇవ్వడం.
ఫేస్బుక్లోకి అప్లోడ్ అయిన కొద్దిసేపటికే ఈ సెల్ఫీ వైరల్గా మారింది. అదికాస్తా పోలీసుల దగ్గరకు చేరింది. ఈ వ్యవహారంపై ఆరా తీసిన వారు... శశికుమార్ను అరెస్ట్ చేశారు. అతడ్ని ఆరా తీస్తే మొత్తం స్టోరీని పూస గుచ్చినట్లు చెప్పాడు.
వెంటనే ఆ గంజాయి మొక్కను తన ఇంటిపై కుండీలో పెంచుతున్న అతడి స్నేహితుడు కమల్ను కూడా పోలీసులకు అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో మూర్తి అనే మరో వ్యక్తిని కూడా కటకటాల్లోకి నెట్టారు.
ఈ మేరకు శశికుమార్, కమల్, మూర్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ముగ్గురూ రిమాండ్లో ఉన్నారు. ప్రస్తుతం ఈ వార్త ట్రెండింగ్ న్యూస్గా మారింది. పాపం శశికుమార్ ఎరక్కపోయి ఇరక్కుపోయాడు. ఏదో సరదాగా సెల్ఫీ దిగితే... ఏకంగా జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది. కాబట్టి.. సెల్ఫీ ప్రియులూ.. తస్మాత్ జాగ్రత్త!