వీడసలు తండ్రేనా : మద్యం కోసం కన్న బిడ్డనే అమ్మేశాడు..
నవరంగపూర్ : మద్యం వ్యసనం మనిషి విచక్షణ కోల్పోయాడు. ముక్కుపచ్చలారని పసివాన్ని మాతృమూర్తికి దూరం చేశాడు. తాగుడికి బానిసై కన్న బిడ్డనే అమ్మేశాడు. మద్యం కోసం తొమ్మిది నెలల వయసున్న పసివాన్ని అంగడి సరుకుగా మార్చేశాడు. పదివేలకు కన్న పేగును అమ్మేశాడు. హృదయ విదారకమైన ఈ ఘటన ఒడిశాలోని నవరంగ్పూర్లో జరిగింది.
నవరంగ్పూర్ జిల్లా పూజారిగూడకు చెందిన సాగరం లోహార్కు భార్య కొడుకు ఉన్నారు. తాగుడుకి బానిసైన అతను మద్యం కోసం ఏం చేసేందుకైనా సిద్ధమయ్యేవాడు. మంగళవారం మద్యం తాగేందుకు డబ్బు లేకపోవడంతో ఆ దుర్మార్గుడు భార్య, 9నెలల కొడుకును దగ్గరలోని గుడికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరు వ్యక్తులతో బేరమాడి వారి నుంచి రూ.10వేలు తీసుకుని పసివాన్ని అమ్మేశాడు. పసికందును అమ్మేందుకు భార్య నిరాకరించడంతో ఆమెను గొడ్డును బాదినట్లు బాదాడు.
బిడ్డను అమ్మిన తర్వాత అత్తవారింటికి వెళ్లిన సాగరం కొడుకు చనిపోయాడని చెప్పాడు. వారిని నమ్మించేందుకు ఓ కట్టుకథ చెప్పాడు. అయితే అతని మాటలు నమ్మని వారు కూతురిని నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. తాగుడు కోసం కన్న బిడ్డను అమ్మేసిన ఆ దుర్మార్గుణ్ని చెట్టుకు కట్టేసిన అత్తింటివారు బడితె పూజ చేశారు. ఆ తర్వాత పోలీసులకు అప్పజెప్పారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు బిడ్డను కొనుగోలుచేసిన వారి కోసం గాలిస్తున్నారు.