ఆత్మహత్యకు యత్నించిన యువకుడు.. ఫేస్ బుక్ లో లైవ్ వీడియో: చివరికి ఏమైందంటే?
చెన్నై: తమిళనాడులో ఓ యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన సంచలనం రేపింది. దీనికి కారణం.. తన ఆత్మహత్యాయత్నాన్ని అతను ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారం చేయడమే. దీన్ని చూసిన అతని స్నేహితులు సకాలంలో సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి గల కారణం.. విషాదమయం. పెద్దలను ఎదిరించి, ప్రేమించి, పెళ్లి చేసుకున్న తన భార్య చివరికి తనపై ఎదురు కేసు పెట్టిందట. దీన్ని తట్టుకోలేక ఆ యువకుడు పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు.
బాధితుడి పేరు సాజిన్. చెన్నైలో భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. తమిళనాడులోని నాగర్ కోయిల్ కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థినిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం ఆ ఇద్దరి ఇళ్లల్లోనూ తెలియదు. పెళ్లి చేసుకున్న తరువాత ఎవరి ఇళ్లల్లో వాళ్లు నివసించసాగారు. వీలు ఉన్నప్పుడు కలుసుకునే వాళ్లు. ఈ క్రమంలో సాజిన్ తన భార్యకు పంపించిన ఓ ప్రేమ సందేశం ఆమె తల్లిదండ్రుల కంట్లో పడింది. దీనితో వాళ్లు ఆమెను నిలదీయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనితో ఆగ్రహించిన ఆ యువతి తల్లిదండ్రులు.. ఆమెను ఇంట్లో నిర్బంధించారు. సాజిన్ ను హెచ్చరించారు.
ఇదిలా కొనసాగుతుండగా.. ఇటీవలే మధురై న్యాయస్థానం నుంచి సాజిన్ కు సమన్లు అందాయి. దీనిపై అతను ఆరా తీయగా.. స్వయంగా భార్యే అతనిపై కేసు పెట్టినట్టు తేలింది. తనను బలవంతంగా ఎత్తుకెళ్లి, పెళ్లి చేసుకున్నట్లు ఆ యువతి సాజిన్ పై ఎదురు కేసు పెట్టింది. తాను భర్తతో కలిసి నివసించబోనని, తల్లిదండ్రులతో కలిసి ఉంటానని న్యాయస్థానం ముందు వాదించింది. వాదోపవాదాలను విన్న తరువాత ఆ యువతిని తల్లిదండ్రులతో కలిసి ఉండేలా తీర్పు ఇచ్చింది మధురై న్యాయస్థానం. సాజిన్ ఎంతగా ప్రాధేయపడినప్పటికీ.. ఆమె కలిసి నివసించడానికి అంగీకరించలేదు.
దీనితో తీవ్ర మనోవేదనకు గురైన సాజిన్.. కన్యాకుమారి సమీపంలోని ఆసారిపళ్లంలో ఆత్యహత్యకు ప్రయత్నించాడు. తాను ఎందుకు ఆత్యహత్యకు పాల్పడుతున్నాననే విషయాన్ని వివరిస్తూ, పురుగుల మందు సేవిస్తున్న వీడియోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. దీన్ని చూసిన వెంటనే అతని స్నేహితులు అప్రమత్తం అయ్యారు. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని, సాజిన్ ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సాజిన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.