యూపీలో దారుణం : 24 గంటల్లో సోదరి పెళ్లి.. ఆ విషయం తెలిసి కాల్చి చంపిన సోదరుడు..
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. మరో 24గంటల్లో పెళ్లి చేసుకోబోతున్న యువతిని తోడబుట్టిన సోదరుడే కాల్చి చంపాడు. బావ వరుసయ్యే వ్యక్తితో ఆ యువతి సంబంధం పెట్టుకున్నందుకే ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. శనివారం మీరట్లోని లిసారీ గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఇస్లామాబాద్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఇస్లామాబాద్కి చెందిన ఓ యువతికి బావ వరుసయ్యే కాశిం అనే వ్యక్తితో నాలుగేళ్లుగా సంబంధం ఉంది. కొన్నాళ్ల క్రితం యువతి కుటుంబానికి వీరి వ్యవహారం తెలిసింది. దీంతో తమ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆ కుటుంబం కాశింను కోరింది. కానీ కాశిం అందుకు నిరాకరించాడు.
ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆమెకు మరో సంబంధం చూసి పెళ్లి ఖాయం చేశారు. సోమవారం(జనవరి 25) ఆమె వివాహం జరగాల్సి ఉంది. కానీ ఇంతలోనే పరిస్థితులు తలకిందులయ్యాయి. గతంలో ఆమె కాశింతో కలిసి సన్నిహితంగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరో 24గంటల్లో ఆమె పెళ్లి జరుగుతుందనగా సోదరి ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో ఆమె సోదరుడు తీవ్ర ఆగ్రహావేశానికి గురయ్యాడు.క్షణికావేశంలో ఆమెపై కాల్పులు జరిపి హత్య చేశాడు. ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి+తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రెండేళ్ల క్రితం ఇదే ఉత్తరప్రదేశ్లో ఓ పెళ్లి వేడుక సందర్భంగా స్టేజీపై డ్యాన్స్ చేస్తున్న ఓ మహిళను ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపిన ఘటన సంగతి తెలిసిందే. గతేడాది యూపీలో హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటన సహా ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న బదౌని గ్యాంగ్ రేప్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. మహిళలపై నేరాల విషయంలో యూపీ ఎప్పుడూ టాప్లోనే ఉంటోంది. రాష్ట్రంలో మహిళలపై నేరాలు నిత్యకృత్యమవడం ఆందోళన రేకెత్తిస్తోంది.