విమానాశ్రయంలో యువకుడి బీభత్సం: హెలికాప్టర్ ధ్వంసం, విమానం ముందు కూర్చున్నాడు(వీడియో)
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని రాజభోజ్ విమానాశ్రయంలో ఓ 20 ఏళ్ల యువకుడు బీభత్సం సృష్టించాడు. ఆదివారం సాయంత్రం విమానాశ్రయంలో ప్రవేశించిన యువకుడు.. ఓ ప్రైవేటు హెలికాప్టర్ ముందు భాగాన్ని రాళ్లతో కొట్టి పూర్తిగా ధ్వంసం చేశాడు. ఆ తర్వాత ఓ విమానం ముందు వెళ్లి కూర్చున్నాడు .
హెలికాప్టర్ ధ్వంసం చేసి..
అయితే, ఆ యువకుడి మానసిక స్థితి బాగోలేదని, అందుకే ఇలా ప్రవర్తించాడని తెలుస్తోంది. హెలికాప్టర్ ముందు భాగాన్ని ధ్వంసం చేసిన తర్వాత అతడు టేకాఫ్ అవుతున్న స్పైస్జెట్ ముందు వెళ్లి కూర్చున్నాడు. దీంతో ఆ విమానం టేకాఫ్ అవడం ఆలస్యమైంది.
వెంటనే అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ సిబ్బంది..
విమానంలో ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలియక ఆందోలనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) దళాలు అతడ్ని అదుపులోకి తీసుకున్నాయి. ఆ తర్వాత ఆ యువకుడిని పోలీసులకు అప్పగించాయి. అనంతరం ఆ విమానం అక్కడ్నుంచి బయల్దేరింది.
హెలికాప్టర్ ధ్వంసం.. టేకాఫ్ అయ్యే విమానం ముందు కూర్చుకోవడంతో..
‘ఆదివారం సాయంత్రం 5.45 నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకుంది. మానసికస్థితి సరిగాలేని 20ఏళ్ల యువకుడు స్టేట్ హ్యాంగర్ సైడ్ నుంచి విమానాశ్రయంలోకి ప్రవేశించాడు. అక్కడేవున్న ఓ ప్రైవేటు హెలికాప్టర్ను రాళ్లతో కొట్టి ధ్వంసం చేశాడు. ఆ తర్వాత టేకాఫ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్న స్పైస్జెట్ విమానం ముందు కూర్చున్నాడు. దీంతో ఒక్కసారిగా ఆందోళనకర వాతావరణం నెలకొంది' అని సీఐఎస్ఎఫ్ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.