ఢిల్లీలో దారుణం : కూరగాయల దొంగతనం... వృద్దుడి హత్య..
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ వృద్దుడి వద్ద నుంచి కూరగాయాలు దొంగిలించిన ఓ యువకుడు అతని ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్టు డాక్టర్లు నిర్దారించారు. బుధవారం(ఏప్రిల్ 8)న చోటు చేసుకున్న ఈ ఘటన చాలామందిని షాక్కి గురిచేసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని ఫరాష్ బజార్ సమీపంలోని సంజయ్ కాలనీలోని నివసించే మనీష్ అనే యువకుడు బుధవారం ఉదయం కూరగాయల కోసం మార్కెట్కి వెళ్లాడు. తిరిగొస్తున్న క్రమంలో అదే కాలనీకి చెందిన నన్హే అనే యువకుడు ఎదురుపడ్డాడు. ఏదో విషయమై ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఇదే క్రమంలో మనీష్ చేతిలోని కూరగాయాలను లాక్కునేందుకు నన్హే ప్రయత్నించాడు. ఇంతలో మనీష్ తండ్రి అక్కడికి వచ్చి ఇద్దరికి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు.
కానీ నన్హే మనీష్ తండ్రి తలపై బలంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలాడు. ఆపై నన్హే కూరగాయల సంచిని లాక్కుని అక్కడినుంచి పారిపోయాడు. హుటాహుటిన ఆ వృద్దుడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్టు డాక్టర్లు నిర్దారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్కు తరలించిన పోలీసులు నన్హేపై కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. కూరగాయల కోసమే అతను దాడికి పాల్పడ్డాడా.. లేక గతంలో ఇద్దరి మధ్య ఏవైనా గొడవలున్నాయా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.