దారుణం... ఉద్యోగి మర్మాంగాలపై శానిటైజర్ చల్లిన యజమాని...
మహారాష్ట్రలో జరిగిన ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ సంస్థలో పనిచేసే ఓ ఉద్యోగిపై యజమాని దాడికి పాల్పడ్డాడు. అంతేకాదు,అతని మర్మాంగాలపై శానిటైజర్ చల్లాడు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. బాధితుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక గురువారం(జూలై 2) పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది.
అసలేం జరిగింది...
మహారాష్ట్రలోని పుణేలో ఉన్న ఓ సంస్థలో ఓ వ్యక్తి మేనేజర్గా పనిచేస్తున్నాడు. చిత్రకారుల పెయింటింగ్ ఎగ్జిబిషన్స్కు సంబంధించిన వ్యవహారాలను ఈ సంస్థ పర్యవేక్షిస్తుంటుంది. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి నెలలో ఆ వ్యక్తి కంపెనీ పని మీద ఢిల్లీ వెళ్లాడు. వెళ్లిన కొద్దిరోజులకే లాక్ డౌన్ విధించడంతో అక్కడే చిక్కుకుపోయాడు. దీంతో సంస్థ ఇచ్చిన డబ్బులన్నీ తన వ్యక్తిగత అవసరాలకే ఖర్చయిపోయాయి.
ఆ డబ్బు గురించి ప్రశ్నించిన యజమాని
లాక్ డౌన్ సడలింపుల తర్వాత మే 7న అతను పుణే తిరిగొచ్చాడు. అయితే 17 రోజుల పాటు క్వారెంటైన్లో ఉన్న తర్వాతే ఆఫీసుకు రావాలని అతను సూచించాడు. అయితే అన్నిరోజులు హోటల్ క్వారెంటైన్లో ఉండేందుకు అతని వద్ద డబ్బులు లేకపోవడంతో ఫోన్,డెబిట్ కార్డును తాకట్టు పెట్టాడు. ఆ తర్వాత జూన్ 13న యజమాని అతన్ని ఓ చోటుకు పిలిపించాడు. ఢిల్లీ టూర్లో ఖర్చయిన డబ్బు గురించి ప్రశ్నించాడు. ఆ డబ్బు మొత్తం కట్టాల్సిందేనని డిమాండ్ చేశాడు.
కిడ్నాప్... మర్మాంగాలపై శానిటైజర్..
ఈ క్రమంలో తన సహాయకుడితో కలిసి ఆ యజమాని అతన్ని కిడ్నాప్ చేశాడు. కారులో ఎక్కించుకుని అతన్ని ఆఫీస్కు తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లాక మరో ఇద్దరు కూడా యజమానితో చేరినట్లు తెలుస్తోంది. అంతా కలిసి ఆ ఉద్యోగిపై దాడి చేశారు. ఈ క్రమంలో సదరు యజమాని అతని మర్మాంగాలపై శానిటైజర్ చల్లి అమానవీయంగా వ్యవహరించాడు. గాయపడ్డ ఆ ఉద్యోగి ఆ తర్వాత ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు.
కేసు నమోదు...
ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన అనంతరం సంస్థ యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికైతే ఈ కేసుకు సంబంధించి ఎవరిని అరెస్ట్ చేయలేదని సమాచారం. అయితే త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని,బాధితుడికి న్యాయం చేస్తామని పోలీసులు చెబుతున్నారు.